🌼టీచర్ల బదిలీపై కదలిక
♦సంక్రాంతి సెలవుల్లో కసరత్తు
🍁పనితీరు పాయింట్లు ఎత్తివేత
🍁సర్వీసు పాయింట్లే ప్రాతిపదిక
🍁వెబ్కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు
🍁విద్యాశాఖ నుంచి జీఏడీకి ఫైలు
🔹ఉపాధ్యాయ బదిలీలపై కదలిక వచ్చింది. సంక్రాంతి సెలవుల సమయంలో బదిలీలు చేపట్టే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసిన పాఠశాల విద్యా కమిషనర్ తాజాగా ప్రతిపాదిత ఫైలును ప్రభుత్వానికి పంపించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి పరిశీలన అనంతరం దాన్ని రెండు రోజుల క్రితం సాధారణ పరిపాలనశాఖ(జీఏడీ) కు పంపించారు. అక్కడి నుంచి ఫైలు తొలుత న్యాయశాఖకు తర్వాత ఆర్థికశాఖకు వెళుతుంది. స్వల్ప మార్పులతో పాత మార్గదర్శకాలనే అనుసరించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో గతంలో ప్రవేశపెట్టిన పెర్ఫార్మెన్స్ పాయింట్లను ఎత్తివేయాలని, సర్వీస్ పాయింట్ల ప్రాతిపదికగా బదిలీలు చేపట్టాలని సంకల్పించింది.
🔸ఉపాధ్యాయుని మొత్తం సర్వీసు, ఒక పాఠశాలలో పూర్తిచేసిన సర్వీసును బట్టి పాయింట్లు కేటాయించి.. వాటి ప్రాతిపదికగా ప్రాధాన్యతలు కల్పిస్తారు. ఒక ప్రాంతంలో కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక పాఠశాలలో గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసున్న ఉపాధ్యాయులు, ఐదు సంవత్సరాల సర్వీసున్న ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. జనవరి 10 నుంచి 20 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు. ఆ సమయంలో ఉపాధ్యాయులు కూడా ఖాళీగానే ఉంటారు కాబట్టి.. వెబ్కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపడితే సమయం ఆదా అవుతుందని, విద్యార్థులకు కూడా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయంతో కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సదరు ఫైలు జీఏడీ నుంచి న్యాయశాఖకు, అక్కడి నుంచి ఆర్థికశాఖకు వెళ్లాలి. అక్కడ గ్రీన్సిగ్నల్ వస్తే ముఖ్యమంత్రి వద్దకు పంపాలి. ఇంతచేసినా అక్కడ సానుకూలంగా లేకుంటే కథ వెనక్కే. ఉపాధ్యాయ బదిలీలకు సీఎం సానుకూలంగా లేరని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో బదిలీలపై ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది
Thanks for reading About teacher transfers news 2020
No comments:
Post a Comment