సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
వీరి పరిస్థితి ఏంటో...
- - రెండు రోజుల్లో సచివాలయ ఉద్యోగులకు తొలి జీతం?
- - అంగీకారపత్రం ఇచ్చిన నాటి నుంచే వేతనం
- - డీడీవోలుగా గ్రేడ్-1,2,3,4 కార్యదర్శులు
- - సీఎఫ్ఎంఎస్ ద్వారా డేటా ఎంట్రీ
- - ఉత్తర్వులు జారీచేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
- - వివరాలు సేకరించే పనిలో మండల అధికారులు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. వీరికి వేతనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సోమవారం నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. దీంతో మండల పరిషత్ అధికారులు సచివాలయ ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా నియమితులైన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ కార్యదర్శి గ్రేడ్-6లకు డీడీవో (జీతాలు డ్రాచేసి నగదు చెల్లింపు) బాధ్యతలు అప్పగించొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతంలో శాశ్వత ప్రాతిపదికన నియమితులైన గ్రేడ్-1, 2, 3, 4 పంచాయతీ కార్యదర్శులకు మాత్రమే డీడీవో బాధ్యలను అప్పగించాలని మండల పరిషత్ అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. సచివాలయ ఉద్యోగులు అంగీకార పత్రం ఇచ్చిన నాటి నుంచి విధుల్లో ఉన్నట్టు నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరి రెండు నెలలు గడుస్తోంది. కానీ ఇంతవరకూ వేతనాలు అందలేదు. దీంతో వారు ఆశగా నిరీక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి సోమవారం నాటికి వేతనాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. గ్రామ సచివాలయం, ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ. హోదా, విధుల్లో చేరిన తేదీ, ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా నంబర్లు, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలను అడుగుతున్నారు. వీటన్నింటినీ సేకరించి సీఎఫ్ఎంఎస్లో నమోదు చేయాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, పంచాయతీ కార్యదర్శి సాంకేతిక సహయకులు (డిజిటల్) గ్రేడ్-6, గ్రామ రెవెన్యూ అధికారి, ఆరోగ్య కార్యదర్శి (ఏఎన్ఎం), పశుసంవర్ధక శాఖ సహాయకులు (ఎహెచ్ఎ), బహుళ ప్రయోజన వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్ సహాయకులు, (ఎంపీఈవో), మహిళా పోలీస్, శిశు సంక్షేమ శాఖ, ఇంజనీరింగ్, సర్వే, సంక్షేమ, విద్య, విద్యుత్ శాఖ సహాయకులు వంటి 14 రకాల ఉద్యోగుల నియామకాలు జరిగాయి.
ప్రభుత్వం అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. కానీ ఉద్యోగ నియామకాలు పూర్తి చేయలేకపోయింది. అక్కడికి కొద్దిరోజుల తరువాత భర్తీచేసింది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఉద్యోగుల నియామకం జరగలేదు. మరోవైపు విధుల్లో చేరిన ఉద్యోగులకు ఇప్పటివరకూ జీతాలు చెల్లించలేదు. చాలా మంది ఉద్యోగులు అంగీకార పత్రాలు ఇచ్చి అపాయింట్మెంట్ పత్రాలు తీసుకున్నప్పటికీ సకాలంలో విదుల్లో చేరలేదు. విధుల్లో ఎప్పుడు చేరినా.. అంగీకార పత్రం ఇచ్చిన తేదీ నుంచి నమోదు చేసి జీతాలు చెల్లించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
వీరి పరిస్థితి ఏంటో...
సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన కాంట్రాక్ట్ రెండో ఏఎన్ఎంలు అయోమయానికి గురువుతున్నారు. ఆరోగ్య కార్యదర్శులుగా ఎంపికైన వారిలో వీరిదే సింహభాగం. వీరికి సరికొత్త చిక్కొచ్చి పడింది. అక్టోబరులో ప్రభుత్వం ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ రెండో ఏఎన్ఎంలను ఉద్యోగాల నుంచి రిలీవ్ చేయలేదు. అక్టోబరు 6న అంగీకారపత్రాలు ఇచ్చిన వీరు...నవంబరు 6న బాధ్యతలు స్వీకరించారు. అప్పటివరకూ వైద్యఆరోగ్య శాఖలో రెండో ఏఎన్ఎంలుగానే సేవలందించారు.
వీరు విధుల్లో ఉన్నంతవరకూ జీతాలు తీసుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం అంగీకారపత్రం ఇచ్చిన నాటి నుంచే ఉద్యోగులుగా పరిగణించాలి. ఈ లెక్కన ఆరోగ్య కార్యదర్శులుగా ఎంపికైన రెండో ఏఎన్ఎంలందరికీ జీతాలు చెల్లించాలి. అటు వైద్యఆరోగ్య శాఖలో జీతాలు తీసుకున్న వీరు..సచివాలయ ఉద్యోగులుగా మరోసారి ఎలా జీతం తీసుకుంటారన్నది ప్రశ్న. ఒకవేళ సచివాలయ ఉద్యోగులుగా జీతం తీసుకుంటే..గతంలో వైద్యఆరోగ్య శాఖ అందించిన వేతనం వెనక్కి తీసుకుంటారేమోనన్న అనుమానం వీరిని వెంటాడుతోంది.
Thanks for reading First salary for Secretariat employees in two days?
No comments:
Post a Comment