- Rating for Teachers,
- Subject wise assessment of results
- Compulsory retirement if not improved!
🔳 టీచర్లకు రేటింగ్,
సబ్జెక్టుల వారీ ఫలితాలను బట్టి మదింపు
మెరుగుపడకుంటే తప్పనిసరి రిటైర్మెంట్!
వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఇంగ్లీషు మీడియం అమలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ఒకవైపు చర్చ జరుగుతుండగా... మరోవైపు సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ సాహసోపేతమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలన్నీ ఇంగ్లీషు మీడియంలోనే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికీ ఆంగ్లంలో పదాలు రాయలేని విద్యార్థులు అధిక సంఖ్య లో ఉన్నారని ఆ సంస్థ గుర్తించింది. ఇటీవల ఆ సంస్థ కార్యదర్శి కల్నల్ రాములు గురుకులాల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థుల పరీక్షాపేపర్లు ఉన్నతాధికారులకు, మంత్రికి చూపించి విద్యార్థుల ప్రామాణికత ఏ స్థాయిలో ఉందో వివరించారు. ఇంకా 10 శాతానికిపైగా విద్యార్థులకు ఓనమాలు రాని పరిస్థితి ఉందని గుర్తించారు.
పేద ఎస్సీ విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులాలను నమ్మి చేర్పిస్తే... ఏళ్లు గడిచినా వారికి అక్షరాలు రాని పరిస్థితి ఉంటే దానికి ఎవరిని బాధ్యులను చేయాలనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయంపై మంత్రి పినిపే విశ్వరూ్పతో పాటు ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. సబ్జెక్టుల వారీగా టీచర్ల పనితీరును సమీక్షించాల్సిన అవసరముందని గుర్తించారు. చాలామంది టీచర్లు కూడా ప్రమాణాలకు అనుగుణంగా లేరని, పనితీరును మెరుగుపరుచుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారని అంచనా వేశారు. గత మూడేళ్లుగా గురుకుల సొసైటీ సెక్రటరీ కల్నల్ రాములు సంస్కరణలు చేపట్టినప్పుడల్లా కొంతమంది గురుకులాల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, వారికి ప్రభుత్వ పెద్దలు వత్తాసు పలకడంతో సంస్కరణలు అమల్లోకి తీసుకురాలేకపోయారని కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా మంత్రి భరోసా తీసుకుని సెక్రటరీ ఈ సంస్కరణలు చేపడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఆయా సబ్జెక్టుల్లో ఫలితాల్లో వెనుకబడిన చివరి 5 శాతం టీచర్లకు సంబంధించి ముందు పరిశీలన చేస్తారు.
ఇందుకోసం ఆయా జిల్లాలో జిల్లా కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ఎస్సీఈఆర్టీ నిపుణులు, బయట విద్యాసంస్థల నిపుణులు నుంచి ఒకరు, స్థానిక డైట్ కళాశాల నుంచి ఒకరితో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ముందు ఆయా టీచర్లు సెమినార్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా గురుకుల సొసైటీ సెక్రటరీ, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ లేదా డైట్ ప్రిన్సిపాల్, ఎస్సీఈఆర్టీ నుంచి ఇద్దరు సబ్జెక్టు నిపుణులతో కూడిన మరో కమిటీ ముందు అకడమిక్ ఫలితాల్లో ఆఖరులో ఉన్న ఒక శాతం టీచర్లు సెమినార్ ఇస్తారు. ఈ అసె్సమెంట్లో సబ్జెక్టు నాలెడ్జికి సంబంధించి 50 శాతం, టీచింగ్ మెథడాలజీపైన 35 శాతం, ప్రవర్తన నియమావళికి సంబంధించి 15 శాతం పరీక్షిస్తారు. సెమినార్లో ఈ కమిటీలు పరిశీలించిన తర్వాత టీచర్లకు ఎక్సలెంట్, గుడ్, సరాసరి(ఆవరేజ్), సరాసరి కంటే తక్కువగా రేటింగ్లు ఇస్తారు.
ఆరు నెలల్లో మెరుగు
జిల్లా కోఆర్డినేటర్ల ముందు ఇచ్చిన సెమినార్లో టీచర్లు సరాసరి కంటే తక్కువ పనితీరు కనబర్చితే వారికి ఆరు నెలల సమయం ఇస్తారు. వారి పనితీరు మెరుగుపరుచుకున్న ఆరు నెలల తర్వాత ఆ టీచర్లు సొసైటీ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ముందు సెమినార్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికీ వారి పనితీరు సరాసరి లేదా అంతకంటే తక్కువగా ఉంటే... వారికి మరో ఏడాది అవకాశం ఇస్తారు. ఆ లోపు వారి బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఏడాది తర్వాత సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ముందు మళ్లీ హాజరై సెమినార్ నిర్వహించాలి. అప్పటికీ సరాసరి, అంతకంటే తక్కువగా పనితీరు ఉంటే అలాంటి టీచర్లు కచ్చితంగా సర్వీసు నుంచి రిటైర్ కావాల్సి ఉంటుందని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ వెంటనే దృష్టి సారించాలని రాములు ఆదేశాలిచ్చారు.
Thanks for reading Rating for Teachers, Subject wise assessment of results Compulsory retirement if not improved!
No comments:
Post a Comment