Good news for the unemployed ... CM orders to fill 15,971 jobs in AP
నిరుద్యోగులకు శుభవార్త... 15,971 ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం
ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఈ శాఖల ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల సమస్యలు, వాటి పరిష్కారం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు.
ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, నాడు-నేడు కింద స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్గ్రిడ్ తదితర అంశాల గురించి సీఎం అధికారులతో చర్చించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున ఉపాధిహామీ కూలీలకు వ్యవసాయరంగంలో పనులు లభిస్తున్నాయని... మార్చి నాటికి అనుకున్న పనిదినాలతో లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు సీఎంకు తెలిపారు.
ఉపాధి హామీ నిధుల ఖర్చులో లక్ష్యాలను చేరుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలియజేశారు.
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే మినీ గోడౌన్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో స్కూళ్లకు ప్రహరీ గోడలను నిర్మించాలని జగన్ సూచించారు.
ఫిబ్రవరి నుంచి లబ్దిదారులకు ఇంటివద్దే పెన్షన్లు అందించనున్నట్లు సీఎం తెలిపారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు చేరవేయనున్నట్లు తెలిపారు. పెన్షన్లకోసం ఎదురుచూపులు, వేచి చూసే పరిస్థితి లేకుండా చేయడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు జగన్ పేర్కొ న్నారు.
సర్వేలతో ముడిపెట్టి ఇళ్లపట్టాలను నిరాకరించవద్దని సీఎం జగన్ అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆమేరకు లబ్ధి దారులను గుర్తించాలని సూచించారు.
అర్హులైన వారు ఎంతమంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేనని అధికారులకు సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలో కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం అధికారులకు తెలిపారు. వీటిద్వారా మరో 3వేలకు పైగా ఉద్యోగాలు ఈ సచివాలయాల్లో రానున్నాయన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మొత్తం15,971 ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు.
Thanks for reading Good news for the unemployed ... CM orders to fill 15,971 jobs in AP
No comments:
Post a Comment