Ration Card: రేషన్ కార్డుల వడపోత పూర్తయింది.
రేషన్ కార్డుల వడపోత పూర్తయింది. రాష్ట్రంలో కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం కార్డులకు అర్హుల ఎంపిక కొలిక్కివచ్చింది. ఒకటీ రెండూ కాదు ప్రస్తుతం తెల్లకార్డులున్న వారిలో ఏకంగా 18.72 లక్షల కుటుంబాలను అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. ఒక్కో కుటుంబానికి సగటున ముగ్గురు సభ్యుల చొప్పున చూసినా.. సుమారు 55.50 లక్షల మందికి నెల నెలా బియ్యం, ఇతర సరకుల పంపిణీ నిలిచిపోనుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా బియ్యం రూపంలోనే (ప్యాకింగ్తో కలిపి) రూ.1,449 కోట్లు ఆదా అవుతుంది. పంచదార, గోధుమలు, పామోలిన్, చిరుధాన్యాలు తదితర నిత్యావసరాలూ కలిపితే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2.26 లక్షలు, కృష్ణా జిల్లాలో 2.11 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలో 1.94 లక్షల కుటుంబాలకు కార్డులకు అర్హత లేదని తేల్చారు. రాష్ట్రంలో గుర్తించిన అనర్హుల్లో మూడో వంతు ఈ మూడు జిల్లాల నుంచే ఉన్నారు.
వడపోత ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా బియ్యం కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకూ అర్హులను వేర్వేరుగా గుర్తిస్తోంది. దీనికోసమే వైఎస్సార్ నవోదయం పథకాన్ని ప్రారంభించి ఇంటింటి సర్వే చేయించింది. ప్రస్తుతం ఉన్న రేషన్కార్డుల వివరాలను వాలంటీర్లకు ఇచ్చి జాబితాలు తయారు చేయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, నెలకు 200 యూనిట్లకు పైగా విద్యుత్తు వినియోగించేవారు, నాలుగు చక్రాల వాహనాలున్నవారు, 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లున్న వారిని అనర్హులుగా తేల్చింది. వాటి ఆధారంగా అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితా రూపొందించింది. కార్డుదారులందరి వివరాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,001 గ్రామ సచివాలయాలు, క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. వీరందరికి 15 నుంచి కొత్త బియ్యం కార్డులు ఇచ్చి.. మార్చి నుంచి రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అర్హులు ఉంటే.. దరఖాస్తులు తీసుకుని ప్రతి నెలా కొత్త కార్డులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
Thanks for reading Ration Card: రేషన్ కార్డుల వడపోత పూర్తయింది.
No comments:
Post a Comment