15 per cent annual salary increase for bank employees
బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వార్షిక వేతన పెంపు
పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కూడా
8.5 లక్షల మందికి ప్రయోజనం
నవంబరు 2017 నుంచి అమల్లోకి
అంగీకారానికి వచ్చిన యూనియన్లు, ఐబీఏ
దిల్లీ/ముంబయి: దాదాపు మూడేళ్ల పాటు జరిగిన చర్చల అనంతరం బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు, భారత బ్యాంకుల సంఘం(ఐబీఏ) ఒక అంగీకారానికి వచ్చాయి. 15 శాతం వార్షిక వేతన పెంపునకు ఇరు వర్గాలు ఒప్పుకున్నాయి. దీంతో బ్యాంకులు అదనంగా రూ.7,900 కోట్లు ఇందుకోసం కేటాయించాల్సి వస్తుంది. నవంబరు 2017 నుంచి అమల్లోకి వచ్చే ఈ వేతన పెంపుతో దాదాపు 8.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. బుధవారం కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం..ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బందికి పనితీరు ఆధారిత ప్రోత్సాహకం(పీఎల్ఐ)ను సైతం అందించనున్నారు.
ఆయా బ్యాంకుల నికర లాభం లేదా నిర్వహణ లాభం ఆధారంగా ఈ పీఎల్ఐను నిర్ణయిస్తారు. అంటే లాభాలెక్కువున్న బ్యాంకుల్లో సిబ్బందికి అదనపు వేతనం లభిస్తుందన్నమాట.మూల వేతనం, డీఏలను కలుపుతున్నట్లు ఐబీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులన్నీ కలిసి 37 దాకా ఉండగా.. తమ ఉద్యోగుల వేతన పెంపు విషయంపై యూనియన్లతో చర్చలు జరపాల్సిందిగా ఐబీఏను ఇవి కోరాయి.
ఈ నేపథ్యంలో వేతనపెంపు విషయంలో ఐబీఏ, యునైటెడ్ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ)ల మధ్య అంగీకారం కుదిరింది. దీని ప్రకారం.. మార్చి 31, 2017 నాటి వేతనంపై 15 శాతం లెక్కించి వార్షిక వేతన పెంపును అమలు చేస్తారు. ఇక పీఎల్ఐను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు వర్తింపజేస్తారు.
ప్రైవేటు, విదేశీ బ్యాంకుల విషయంలో పీఎల్ఐ ఆప్షనల్గా ఉంటుంది. కాగా, బ్యాంకు నిర్వహణ లాభం 5 శాతం కంటే తక్కువగా ఉంటే పీఎల్ఐ ఇవ్వనవసరం లేదు. మరో వైపు కొత్త పింఛను పథకం(ఎన్పీఎస్)కు బ్యాంకులు ఇచ్చే వాటాను సైతం ప్రస్తుత 10 శాతం నుంచి 14 శాతానికి పెంచనున్నారు. అయితే దీనికి ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది. మరో పక్క, కుటుంబ పింఛను విషయంలో పరిమితిని తొలగించడంతో పాటు.. మూలవేతనంలో 30 శాతాన్ని ఇవ్వడానికి సైతం అంగీకారం కుదిరినట్లు ఐబీఏ ట్వీట్ చేసింది.
Thanks for reading 15 per cent annual salary increase for bank employees
No comments:
Post a Comment