విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్ కే దక్కుతుంది : సీఎం జగన్
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మైనారిటీ డే కార్యక్రమం నిర్వహించారు. విద్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకువచ్చిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్కే దక్కుతుందని సీఎం జగన్ కొనియాడారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని.. ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న అపార మేధావి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని సీఎం జగన్ కొనియాడారు. భారతదేశానికి 1947-58 వరకు ఆజాద్ అందించిన సేవలు మరువలేనివన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ డేగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జరుపుకుంటామని....2008లో అప్పటి సీఎం వైఎస్సార్ ఈ రోజును మైనారిటీల సంక్షేమ దినంగా జరిపేందుకు జీవో జారీ చేశారని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకువచ్చిన ఘనత ఆజాద్కే దక్కుతుందన్నారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. కేంద్ర విద్యాశాఖలో భాగమైన అనేక కమిషన్లు, బోర్డులు, విద్యా సంస్థలు ఆజాద్ హయాంలో ప్రారంభించారని సీఎం తెలిపారు.
పిల్లల బాగోగుల కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాం..
రాష్ట్రంలో కూడా అటువంటి విద్యా విధానాన్నే అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ పేదలు చదువుకునే పాఠశాలలను నాడు నేడు కింద బాగు చేస్తున్నామన్న జగన్...చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కిట్లు ఇవ్వడం సహా సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నామన్నారు. మధ్యాహ్నభోజనంలో కూడా మంచి భోజనం ఇచ్చేలా మెనును మార్చామని....పిల్లల బాగోగుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటోన్న ప్రభుత్వం తమదేనని జగన్ తెలిపారు. రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్న సీఎం..వారి అభివృద్ధి కోసం అన్ని రకాల ప్రోత్సాహకాలు, పథకాలు వర్తింపజేస్తున్నట్లు వివరించారు. ఎలాంటి అవినీతి తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులకు పథకాలు అందజేస్తున్నామన్నారు. 2020 అక్టోబర్ వరకు మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా రూ.3428 కోట్లు అందించినట్లు సీఎం చెప్పారు. వీటిలో రూ.2585 కోట్లు నేరుగా లబ్దిదారులకు అందజేశామని...మిగిలినవి రూ.843 కోట్లు మరికొన్ని పథకాల ద్వారా ఇచ్చామన్నారు జగన్.
Thanks for reading Azad is credited with bringing about changes in the education system: CM Jagan
No comments:
Post a Comment