పిల్లలను పాఠశాలకు పంపడం ఎలా?
ఇది చలికాలం.. ఆపై కరోనా భయం. ఈ పరిస్థితుల్లో స్కూళ్లు మొదలైతే ... పిల్లలను బడికి పంపటం ఎలా? ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులను సతమతం చేస్తున్న సందిగ్ధం ఇది. స్కూలుకు వెళ్లకుండా పిల్లలు ఇంట్లో ఎంతకాలం ఉండగలరు? ఆన్లైన్ పాఠాలు అంత మెరుగ్గా ఉండడం లేదు కదా? ఇదొక ఆలోచన. ఇన్నాళ్లూ భద్రంగా ఉన్న పిల్లలు ఇప్పుడు స్కూలికి వెళ్లి .. కోవిడ్కి గురైతే ...? ఇది మరొక ఆందోళన.
కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 18 నుంచి స్కూళ్లు మూతపడ్డాయి. సంవత్సరాంత పరీక్షలు రాయకుండానే విద్యాసంవత్సరం ముగిసింది. తరువాతి విద్యా సంవత్సరంలోని ముఖ్యమైన ఆరు నెలలూ స్కూళ్లు తెరవకుండానే గడిచిపోయాయి. సెప్టెంబరు నుంచి 9, 10 తరగతులకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ప్రత్యక్షంగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఈనెలలో కొన్ని ప్రయివేటు స్కూళ్లు 7, 8 తరగతులకు కూడా క్లాసులు జరపాలని నిర్ణయించాయి. అయితే, పిల్లలను స్కూలికి పంపాలా వద్దా అన్నది తల్లితండ్రుల ఎంపికే. స్కూలికి రాలేని పిల్లలకు ఈ విద్యాసంవత్సరం మొత్తం ఆన్లైను క్లాసులు కూడా అందుబాట్లో ఉంటాయి. ఇంటర్మీడియట్ క్లాసులకు కూడా ఇదే పరిస్థితి! తల్లిదండ్రుల పూచీకత్తుతో పిల్లలను స్కూళ్లకు పంపాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక డిక్లరేషన్ రాసి స్కూలు యాజమాన్యానికి ఇవ్వాలి. మాస్కులు, శానిటైజర్లు, ట్రాన్స్పోర్టు వంటి వాటిని తల్లిదండ్రులే సమకూర్చుకోవాలని ప్రయివేటు యాజమాన్యాలు ఇప్పటికే సర్క్యులర్లు జారీ చేశాయి.
మనదేశంలో రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలు ఎన్నో. లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైనా అన్ని వర్గాల పిల్లలు వాటిని చేరుకోలేకపోయారు. విద్యావంతులు, ఆర్థికంగా ఎదిగినవారు మినహా దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఇప్పుడు కూడా పిల్లలను స్కూలుకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కరోనా ఉధృతి తగ్గిందని గణాంకాల్లో కనబడుతోందే కాని వాతావరణ మార్పులు స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో తేల్చుకోలేక పోతున్నారు.
స్కూలు భద్రమేనా?
ఒక్కో తరగతి గదికి 30 నుంచి 50 మంది పిల్లలకు తరగతులు నిర్వహించడం మన దగ్గర సర్వ సాధారణం. ఇలాంటి స్థితిలో పిల్లలు ఎవరికి వైరస్ సోకినా మిగతావారికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే పిల్లలు వైరస్ బారిన పడినా ప్రమాద తీవ్రత తక్కువేనని వైద్యనిపుణులు అంటున్నారు. అలా అని తెలిసి తెలిసి పిల్లలను ప్రమాదానికి గురి చేయగలమా అని కొందరు తల్లిదండ్రులు వెనకంజ వేస్తున్నారు. మరికొంత కాలం చూశాక పంపిద్దాం అని మరికొంత అనుకుంటున్నారు. కొంతమంది తగిన జాగ్రత్తలు తీసుకొని పిల్లలను స్కూలికి పంపిస్తున్నారు. ఎవరేం చేసినా పిల్లలకు చదువు చాలా ముఖ్యమైన విషయం. ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా పాఠాలు నేర్చుకునే వాతావరణం వారికి ఉండాలి. అందుకోసం తల్లిదండ్రులు, స్కూలు యాజమాన్యాలు, ఉపాధ్యాయులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
స్కూలికి పంపితే ...
- స్కూలు యాజమాన్యాలు విద్యార్థుల మధ్య భౌతికదూరం తప్పనిసరి చేయాలి.
- డెస్క్ల మధ్య దూరం పెంచాలి. భోజన విరామ సమయాల్లో కూడా దూరం పాటించాలి. వీలైతే డెస్కుల వద్దే భోజనం చేసేలా చూడాలి.
- చేతుల పరిశుభ్రతపై అవగాహన పెంచాలి.
- శానిటైజరు వాడకం క్రమపద్ధతిలో అమలయ్యేలా పర్యవేక్షించాలి.
- తరగతి గదిని రోజూ కనీసం రెండుసార్లు శానిటైజ్ చేయాలి.
- అనారోగ్యంగా కనిపించే విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇతర విద్యార్థుల నుంచి దూరంగా ఉంచి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి.
- అనారోగ్యంగా ఉన్న విద్యార్థులు స్వచ్ఛందంగా ఐసోలేట్ అయ్యేలా ప్రోత్సహించాలి.
- వేర్వేరు క్లాసులను కలపకూడదు. టీచర్లు ఒక తరగతి గది నుంచి మరో తరగతి గదికి మారుతుంటారు. వీలైతే ఆ ప్రవేశ మార్గాల్లో మార్పులు, చేర్పులు చేయాలి.
- స్కూలు ప్రారంభ, ముగింపు సమయాలను అన్ని తరగతులకు ఒకేలా ఉండకుండా పావుగంట వ్యవధి ఎడం ఉండేలా చూడాలి. ఒకేసారి టీచర్లు, విద్యార్థులు వెళ్లడం, రావడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి.
- వేర్వేరు మార్గాల్లో స్కూల్లోకి ప్రవేశించే ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఒక మీటరు దూరం పాటించేలా సంజ్ఞలు, టేపులు వంటి వాటిని అమర్చాలి.
- క్లాసు రూము వెలుపల, స్వచ్ఛమైన గాలి ప్రసరణ ఉండేచోట తరగతి గదుల నిర్వహణ చేయాలి.
- నీటిలభ్యత పుష్కలంగా ఉండేలా చూడాలి. సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
ఆన్లైనే బెటరనుకుంటే ...
- స్కూలుకు పంపకుండా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే పిల్లలు కూడా కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి.
- ఆన్లైన్ క్లాసులు అనగానే పిల్లలకు ఫోన్లు ఇచ్చేసి పాఠాలు వినడమే అనే భ్రమను ముందు తొలగించుకోవాలి.
- ఫోన్లలో పిల్లలకు అనవసరమైన, హింసాప్రవృత్తికి కారణమైన సమచారం అసంఖ్యాకంగా ఉంటోంది. అలాంటివాటి జోలికి పోకుండా చూడాలి. విద్యార్థులకు పాఠశాల వాతావరణం ఉండేలా శ్రద్ధ వహించాలి.
- స్కూలు టైముకు తయారు చేయడం, పుస్తకాలు దగ్గర పెట్టుకోవడం వంటివన్నీ అలవాటు చేయాలి. వారిపై ఎటువంటి ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడాలి.
- పాఠాలు వినే సమయంలోనూ, క్లాసుకు క్లాసుకూ మధ్యలోనూ వేరే పనులు చెప్పకూడదు.
- టిఫిన్, స్నాక్స్, భోజనం వంటివి సమాయానికి పూర్తి చేసేలా చూడాలి.
- వారానికి ఒక్కసారైనా టీచర్లతో మాట్లాడాలి. ఆన్లైన్లో వారు పంపే సూచనలు, సలహాలూ ఫాలో అవ్వాలి. వాటికి అనుగుణంగా పిల్లలు చదివేలా పర్యవేక్షించాలి.
Thanks for reading How to send children into school?
No comments:
Post a Comment