ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గురువారం ఉదయం కీలక తీర్పు వెలువరించింది. ఎస్ఈసీ అప్పీల్పై ధర్మాసనం ఎదుట రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు ఆపడానికి సహేతు కారణాలు లేవని పేర్కొంది. రాజ్యాంగంలోని 9, 9ఏ షెడ్యూల్ ప్రకారం కాల పరిమితిలోగా ఎన్నికల నిర్వహణ తప్పనిసరి. తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న అంతిమ నిర్ణయం ఎన్నికల కమిషన్ దే. కేంద్ర ఎన్నికల కమిషన్కు ఎలాంటి అధికారాలు ఉన్నాయో రాష్ట్ర ఎన్నికల కమిషన్కూ అలాంటి అధికారాలు ఉన్నాయి. సింగిల్ బెంచ్ తీర్పు ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉంది. ఎన్నికల కమిషన్కు దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. స్థానిక ఎన్నికలు జరిగితే ఎన్నికైన ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తారు. వ్యాక్సినేషన్ పేరుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని కోరడంలో సహేతుకంలేదు. మూడో దశలో భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉన్నందున ఈలోపు ఎన్నికల నిర్వహణ సబబే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అమెరికాతో పాటు మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన అంశాన్ని గుర్తు చేసింది.
షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం : ఎస్ఈసీ
హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. త్వరలో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని ఎస్ఈసీ వెల్లడించారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.
ఎన్నికలు భయపడి స్థానిక ఎన్నికలను వాయిదా కోరడం లేదు.. ప్రజల ఆరోగ్యం ముఖ్యం.. రాజకీయాలు కాదు... హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానాలకు వెళతామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా సిద్దమే.. కానీ, ప్రస్థుత పరిస్థితుల్లో ఎన్నికలు అంత అనుకూలమైన వాతావరణం కాదు.. కోవిడ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హైకోర్టు తీర్పు మేం ఆశించినట్లు లేదని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ పేర్కొంది. ఉద్యోగుల్లో కరోనా భయం ఎక్కువగా ఉందని తెలిపింది. టీకా పంపిణీ పూర్తయ్యాక ఎన్నికలు జరపాలని కోరినట్లు ఫేడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. కరోనా భయంతో అనేకమంది సెలవుల్లో ఉన్నారన్నారు. వేలమందికి కరోనా సోకింది, వందలమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు టీకా పంపిణీ జరుగుతోందని పేర్కొన్నారు. అది పూర్తి అయ్యాక ఎన్నికలు పెట్టాల్సిందిగా మా న్యాయబద్దమైన కోరిక అని వెల్లడించారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని.. ఆ తర్వాత మేం కూడా ఎన్నికలకు సిద్ధమే అన్నారు. సుప్రీం కోర్టులో అప్పీలు వేయాలని నిర్ణయించామని.. సుప్రీం కోర్టులో మా వాదన కూడా వినిపిస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగులపై అంత ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది. మరో రెండు నెలలు పాటు వాయిదా వేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు.
Thanks for reading Conduct elections without difficulty: High Court
No comments:
Post a Comment