కొత్త ఎస్ఈసీ కోసం గవర్నర్కు మూడు పేర్లు సిఫారసు చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎన్నికల కమిషన్ నియామకానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్ కు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, అలాగే ప్రేమచంద్రా రెడ్డి, శామ్యూల్ పేర్లను గవర్నర్ కు ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో నీలం సాహ్నీ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎస్ గా పనిచేసి రిటైర్ అయిన నీలం సాహ్నీ.. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాన సలహాదారుగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆమెకు జీత భత్యాలతో పాటు అదనపు సిబ్బందిని కూడా ప్రభుత్వం కేటాయిచింది. సీనియారిటీ, సమర్ధత ఆధారంగా గవర్నర్ ఎస్ఈసీని నియమిస్తారు. ఇందులో ప్రభుత్వ ఆసక్తిని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 31 లోగా కొత్త ఎస్ఈసీని ప్రభుత్వం ప్రకటించనుంది.
మరోవైపు ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఎస్ఈసీని నియామకానికి రంగం సిద్ధం చేసింది. ఇక ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం అందరికీ తెలిసిందే. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పటి నుంచి అటు ఎస్ఈసీకి ఇటు ప్రభుత్వానికి మధ్య వైరం నెలకొంది. మధ్యలో ఎస్ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిని సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. రాష్ట్ర ప్రభుత్వంపై విజయం సాధించి తిరిగి పదవిని చేపట్టారు.
అనంతరం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం ప్రభుత్వం వ్యతిరేకించడం.. దీనిపైనా హైకోర్టు, సుప్రీం కోర్టులో వాదనలు జరగ్గా.. ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఎన్నికలకు సహకరించింది. దీంతో పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఐతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం ఇంకా నిర్వహించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నిమ్మగడ్డ హయాంలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో కొత్త ఎస్ఈసీ ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే నిమ్మగడ్డ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వెంటనే.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీగా నియమించింది. తర్వాతి పరిణామాలతో నిమ్మగడ్డ తిరిగిని పదవి చేపట్టారు. ఐతే జస్టిన్ కనగరాజ్ ను పరిగణలోకి తీసుకోకుండా కొత్త జాబితాను గవర్నర్ కు పంపడం గమనార్హం. మరి ప్రభుత్వం పంపిన జాబితా నుంచి గవర్నర్ ఎవర్ని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. నియామక ప్రక్రియ పూర్తైతే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రానికి కొత్త ఎస్ఈసీ ఉంటారు.
Thanks for reading The government recommended three names to the governor for the new SEC
No comments:
Post a Comment