Corona: ఉపశమనం ఇచ్చే ‘పాజిటివ్’ న్యూస్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. వ్యాక్సినేషన్ సైతం క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్, కఠిన ఆంక్షలు అమలవుతుండటంతో కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివిటీ రేటు దిగి వస్తుండగా.. రికవరీ రేటు పెరుగుతుండటం ఊరటనిచ్చే అంశం. మరోవైపు, కరోనాపై పోరులో పలు సంస్థలు భారత్కు అండగా నిలుస్తున్నాయి. కొవిడ్ వేళ.. ఉపశమనం కలిగించే కొన్ని వార్తలు మీకోసం..
💠 భారత్లో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతోందని కేంద్రం వెల్లడించింది. రెండో విజృంభణ తగ్గుతుండగా.. వ్యాక్సినేషన్ రేటు పెరుగుతోందని తెలిపింది. వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేసేందుకు విదేశీ ఉత్పత్తి సంస్థలను కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. గత 20 రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. వారం రోజులుగా 24 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టినట్టు తెలిపారు.
💠దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం క్రమంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22,17,320 శాంపిల్స్ పరీక్షించినట్టు కేంద్రం తెలిపింది. గత 15 వారాల్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య ఇప్పటికి 3.1 రెట్లు పెరిగినట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 33.69 కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
💠 భారత్లో అందుబాటులోకి వచ్చిన మూడో వ్యాక్సిన్ స్పుత్నిక్-V తమ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు అపోలో ఆస్పత్రుల ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ శోభనా కామినేని వెల్లడించారు. జూన్ రెండో వారం నుంచి తమ ఆస్పత్రుల్లో ఈ టీకా అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు.
💠 దేశంలో రికవరీ రేటు పెరుగుతోంది. తాజాగా నమోదైన కొత్త కేసుల కన్నా అధికంగా 71,837 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయినట్టు అధికారులు వెల్లడించారు. మే 3నుంచి రికవరీ రేటులో స్థిరమైన పెరుగుదల కనబడుతోందన్నారు. ప్రస్తుతం ఇది 85.6శాతం నుంచి 90.01శాతానికి పెరగడం సానుకూల సంకేతమని లవ్ అగర్వాల్ తెలిపారు.
💠రోజురోజుకీ పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ బాధితుల చికిత్సకు ఇంజెక్షన్లు కొరత వేధిస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ సంస్థ ఆపన్న హస్తం అందించింది.ఇప్పటికే 1.21 లక్షల యాంఫోటెరిసిన్-బి వయల్స్ను భారత్కు పంపిన ఆ సంస్థ.. మరో 85 వేల వయల్స్ త్వరలో పంపనుంది. వీటితో పాటు మరో 10 లక్షల డోసులను అందించనున్నట్లు గిలీడ్ సైన్సెస్ ప్రకటించింది. బుధవారం మరో 29,250 వయల్స్ను బ్లాక్ ఫంగస్ కేసుల తీవ్రత ఆధారంగా పలు రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు.
💠 కరోనా విజృంభణ వేళ టీకాల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్రాలకు మరో మూడు రోజుల్లో 11లక్షలకు పైగా డోసులు పంపిణీ చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 22,16,11,940 టీకా డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచగా.. 20,17,59,768 టీకాలు (వృథాతో పాటు) వినియోగించినట్టు తెలిపింది. ప్రస్తుతం 1,84,90,522 డోసులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయి.
💠 పశ్చిమబెంగాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ని జూన్ 15వరకు అక్కడి ప్రభుత్వం పొడిగించింది. ఇప్పటికే అమలవుతున్న లాక్డౌన్ ఈ నెల 30తో ముగియనుంది. కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. మరోవైపు, పంజాబ్ కూడా కరోనా ఆంక్షలను జూన్ 10వరకు పొడిగించింది. వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్యపై విధించిన పరిమితిని తొలగించింది.
💠 కరోనా సెకండ్ వేవ్లో వైరస్ సోకి వైద్యం అందక అవస్థలు పడుతున్న అనేక మందికి ‘సేవా భారతి’ సంస్థ ఆశాకిరణంగా మారింది. హైదరాబాద్ నగర శివారులోని అన్నోజిగూడలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స అందిస్తోంది. 200 పడకలతో ఉన్న ఈ సెంటర్లో వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడి నుంచి ఇప్పటికే వందలాది మంది చికిత్సపొంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా చికిత్స కోసం ఈ సెంటర్లో చేరాలనుకుంటే ముందుగా 040-48212529కి ఫోన్ చేసి సంప్రదించాలని తెలిపారు. అయితే, ఆర్టీ-పీసీఆర్ నివేదిక మాత్రం తప్పనిసరి.
💠 కరోనాతో దేశంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా భారీ సహకారం అందించింది. కరోనా నివారణ చర్యల నిమిత్తం రూ.6.5కోట్ల సాయం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సహాయ నిధికి రూ.2.2కోట్లు; తమిళనాడు సీఎం సహాయ నిధికి రూ.25లక్షలు చొప్పున విరాళంగా అందజేసింది. అలాగే, రూ.4.3కోట్లు విలువ చేసే మాస్క్లు, పీపీఈ కిట్లు, తదితర పరికరాలను అందజేసినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
💠 చిన్నారులకు టీకాలు వేసేందుకు ఫైజర్ వ్యాక్సిన్ సేకరణను వేగవంతం చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫాస్ట్ ట్రాక్ విధానంలో తమ టీకాకు అనుమతులు మంజూరు చేయాలంటూ ఫైజర్ సంస్థ కోరిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ విజ్ఞప్తి చేశారు. సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యమైన 12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించాలని భావిస్తే.. విద్యార్థులు, ఉపాధ్యాయులందరికీ టీకా ఇవ్వాలని కూడా కేజ్రీవాల్ సూచించారు.
Thanks for reading Corona: Some relief news for you ..
No comments:
Post a Comment