positive news: ఊరటనిచ్చే వార్తలివే!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దాదాపు అన్ని రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకొన్ని ఊరట కలిగించే వార్తలు మీకోసం.
* అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేతతో అంతర్ రాష్ట్ర సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. సోమవారం నుంచి ఏపీకి బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.
* ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,00,001 నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,646 కరోనా కేసులు నమోదయ్యాయి. 50 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 63,068 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
* దేశ రాజధాని దిల్లీలో సోమవారం నుంచి బార్లు, పబ్లిక్ పార్కులు, ఉద్యానవనాలను తెరిచేందుకు అనుమతి ఇస్తూ, దిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(డీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. 50శాతం సామర్థ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ బార్లు తెరిచి ఉంచవచ్చని తెలిపింది.పబ్లిక్ పార్కులు, ఉద్యానవనాలు, గోల్ఫ్ క్లబ్లు, ఆరు బయట యోగా కార్యక్రమాలకు కూడా డీడీఎంఏ అనుమతి ఇచ్చింది.
* దేశంలో కరోనా ఉద్ధృతి మరింత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు 60 వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 18,11,446 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 58,419 కేసులు నమోదయ్యాయి. 81 రోజుల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.
* కొవిడ్-19 బాధితుల్లో వెంటిలేటర్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అవసరమయ్యేవారిని ముందుగానే గుర్తించేందుకు భారత్లో ఒక కొత్త సాఫ్ట్వేర్ సిద్ధమైంది. దీనికి ‘కొవిడ్ సివ్యారిటీ స్కోర్’ అని నామకరణం చేశారు. ఆరోగ్యం విషమించకముందే బాధితులకు సకాలంలో చికిత్స అందించి, ప్రాణాలు కాపాడటానికి ఇది దోహదపడుతుంది. ఈ సాఫ్ట్వేర్లో ఒక అల్గోరిథమ్ ఉంటుంది. ఇది బాధితుల్లో వ్యాధి లక్షణాలు, సంకేతాలు, కీలక పరామితులు, ఆరోగ్య పరీక్షల ఫలితాలు, ఇతరత్రా అనారోగ్యాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది. వాటిని విశ్లేషించి.. కొవిడ్ తీవ్రత స్కోరు (సీఎస్ఎస్)ను ఇస్తుంది. దీని ఆధారంగా వెంటిలేటర్ తోడ్పాటు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఇతరత్రా సేవలు అవసరమయ్యే వారిని ముందుగానే గుర్తిస్తుంది.
* కొవిడ్ వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే 9 లక్షల నుంచి 10 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసులు వేయాలనే లక్ష్యంతోనే రాష్ట్రంలో మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇవాళ ఒక్కరోజే సుమారు 12 లక్షల మందికి టీకాలు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు.
* కంటికి కనిపించనంత దూరంలో ప్రయాణించే విధానంలో.. డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరాను దేశంలో తొలిసారిగా కర్ణాటకలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. బెంగళూరుకు 80 కి.మీ.ల దూరంలోని చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూర్లో ఈనెల 21న అధికారికంగా దీనికి శ్రీకారం చుడుతున్నారు. నారాయణ హెల్త్కేర్ భాగస్వామ్యంతో బెంగళూరుకు చెందిన డ్రోన్ నిర్వహణ కంపెనీ టీఏఎస్ దీనికి నేతృత్వం వహిస్తోంది.
Thanks for reading corona: Soothing ‘Positive’ News!
No comments:
Post a Comment