Vaccine: త్వరలో మరో టీకా.. జాన్సన్ అండ్ జాన్సన్కు అత్యవసర అనుమతులు
దిల్లీ: కొవిడ్-19కు ఒకే డోసు టీకా తీసుకొచ్చిన అమెరికా దిగ్గజ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్.. భారత్లో అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘భారత్ తన టీకా పరిధిని విస్తరించింది. జాన్సన్ & జాన్సన్కు చెందిన సింగిల్ డోసు టీకా అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. దీంతో భారత్లో అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందిన టీకాల సంఖ్య ఐదుకు చేరింది. కరోనాపై మనదేశం జరుపుతోన్న పోరాటానికి ఇది తోడ్పాటునివ్వనుంది’ అని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.
భారత్లో అత్యవసర వినియోగ అనుమతుల కోసం ఆగస్టు 5న దరఖాస్తు చేసుకున్నట్లు నిన్న జాన్సన్ ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వంతో జరుపుతోన్న చర్చలు త్వరలోనే కొలిక్కి రావాలని కోరుకుంటున్నామన్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఆమోదం లభించింది.
ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు అందుబాటులో ఉండగా.. అమెరికాకు చెందిన మోడెర్నా టీకాకు కూడా ఇటీవల కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. మోడెర్నా టీకాలను దిగుమతి చేసుకునేందుకు దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం స్పుత్నిక్ ప్రైవేటులోనే ఎక్కువగా అందుబాటులో ఉంది. ఈ జాబితాలోకి ఇప్పుడు జాన్సన్ టీకా చేరింది. అయితే మిగతావన్నీ రెండు డోసుల టీకాలు కాగా.. జాన్సన్ మాత్రం సింగిల్ డోసు టీకా కావడం గమనార్హం.
Thanks for reading Vaccine: Another vaccine coming soon .. Emergency permits for Janssen & Janssen
No comments:
Post a Comment