Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, April 9, 2022

AP Cabinet Latest updates









ఆంధ్రప్రదేశ్‌ కొత్త కేబినెట్‌ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్‌ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సామాజిక సమతుల్యతను పాటించారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటి వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.


కేబినెట్ పైనల్ లిస్టు

  1. గుడివాడ అమర్నాథ్‌
  2. దాడిశెట్టి రాజా
  3. బొత్స సత్యనారాయణ
  4. రాజన్నదొర
  5. ధర్మాన ప్రసాదరావు
  6. సీదిరి అప్పలరాజు
  7. జోగి రమేష్‌
  8. అంబటి రాంబాబు
  9. కొట్టు సత్యనారాయణ
  10. తానేటి వనిత 
  11. కారుమూరి నాగేశ్వరరావు
  12. మేరుగ నాగార్జున
  13. బూడి ముత్యాలనాయుడు
  14. విదుదల రజిని
  15. కాకాణి గోవర్ధన్‌రెడ్డి
  16. అంజాద్‌ భాష
  17. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  18. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
  19. పినిపె విశ్వరూప్‌
  20. గుమ్మనూరు జయరాం
  21. ఆర్కే రోజా
  22. ఉషశ్రీ చరణ్‌
  23. ఆదిమూలపు సురేశ్‌
  24. చెల్లుబోయిన వేణుగోపాల్‌
  25. నారాయణస్వామి


కొత్తమంత్రుల నేపథ్యం వివరాలు

వైకాపా ప్రభుత్వ తొలి మంత్రివర్గం మొత్తాన్ని రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి నేడు కొత్త కేబినెట్‌ను కొలువుతీర్చనున్నారు.

పాత, కొత్తల కలయికతో ఏర్పడనున్న ఈ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నేతలు, వారి నేపథ్యం, రాజకీయ ప్రస్థానమిదీ..

అనుభవానికి పెద్దపీట

నియోజకవర్గం-పుంగనూరు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ)

వయసు: 70 సంవత్సరాలు విద్యార్హత: ఎంఏ పీహెచ్‌డీ

రాజకీయ నేపథ్యం: 1974లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా, 1985, 1994ల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పీలేరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1989, 1999, 2004లో పీలేరు నుంచి, 2009లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత వైకాపాలో చేరి 2014, 2019ల్లో పుంగనూరు నుంచి విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, జగన్‌ క్యాబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు.

పెద్దిరెడ్డి కుమారుడు పి.వి.మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా, ఆయన సోదరుడు ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

రైల్వే ఉన్నతాధికారి నుంచి రాజకీయ నేతగా

నియోజకవర్గం-యర్రగొండపాలెం

ఆదిమూలపు సురేష్‌ (ఎస్సీ)

వయసు: 58 సంవత్సరాలు విద్యార్హత: ఎంటెక్‌, పీహెచ్‌డీ

రాజకీయ నేపథ్యం: రైల్వేలో డిప్యూటీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో సంతనూతలపాడు నుంచి వైకాపా అభ్యర్థిగా గెలిచారు. 2019లో మళ్లీ యర్రగొండపాలెం నుంచి వైకాపా తరఫున విజయం సాధించి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రికి విశ్వాసపాత్రుడిగా పేరుండటంతో మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కింది.

పంచాయతీరాజ్‌ శాఖలో ఏఈఈగా పని చేస్తూనే 1989లో సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఐఆర్‌ఎస్‌కు ఎంపికై ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీసెస్‌ విభాగంలో పనిచేశారు. ఆయన భార్య టి.హెచ్‌.విజయలక్ష్మి ఆదాయపు పన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి సీబీఐ కోర్టులో వీరిద్దరిపై కేసు నడుస్తోంది.

సుదీర్ఘ రాజకీయ నేపథ్యం

నియోజకవర్గం-గంగాధరనెల్లూరు (ఎస్సీ)

కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ)

వయసు: 73 సంవత్సరాలు విద్యార్హత: బీఎస్సీ

రాజకీయ నేపథ్యం: కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1983లో కార్వేటినగరం సమితి అధ్యక్షుడిగా గెలిచారు. 2004లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి తెదేపా అభ్యర్థి ఎన్‌.శివప్రసాద్‌పై గెలిచారు. 2009లో ఓడిపోయారు. తర్వాత వైకాపాలో చేరి 2014, 2019ల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీలతో విజయభేరి మోగించారు. జగన్‌ తొలి మంత్రివర్గంలో మొదటిసారి మంత్రిగా చోటు దక్కించుకున్నారు. తాజాగా మళ్లీ కొనసాగింపు దక్కింది.


జడ్పీటీసీ నుంచి మంత్రి వరకు..

నియోజకవర్గం-రామచంద్రపురం

చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (బీసీ)

వయసు: 60 సంవత్సరాలు విద్యార్హత: బీఎస్సీ

రాజకీయ నేపథ్యం: కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2001 నుంచి 2006 వరకు రాజోలు జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. తర్వాత అయిదేళ్లు తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు అధ్యక్షుడిగా వ్యవహరించారు. తర్వాత వైకాపాలో చేరారు. 2014లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019లో రామచంద్రాపురం నుంచి తెదేపా అభ్యర్థిపై గెలుపొందారు. 2020 జులైలో తొలిసారిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా వ్యవహరించారు.

నలుగురు సీఎంలకు సచివుడు

నియోజకవర్గం- చీపురుపల్లి

బొత్స సత్యనారాయణ (బీసీ)

వయసు: 64 సంవత్సరాలు విద్యార్హత: బీఏ

రాజకీయ నేపథ్యం: 1978లో విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. 1992 నుంచి 1999 వరకు రెండుసార్లు విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా పని చేశారు. 1996లో బొబ్బిలి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా, 1999లో అక్కడి నుంచే కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా గెలిచారు. 2004, 2009ల్లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో 2014లో ఓడిపోయారు. తర్వాత వైకాపాలో చేరి 2019లో మళ్లీ గెలిచారు. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో కీలకశాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2012 నుంచి 2015 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. జగన్‌ కేబినెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచే శారు. ఇప్పుడు మళ్లీ పదవి దక్కింది.

వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, జగన్‌.. మొత్తం నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో పని చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్‌లోనూ, ఇప్పుడు వైకాపాలోనూ ఉత్తరాంధ్రలో అత్యంత కీలకనేత.

తండ్రికి రాజకీయ వారసురాలు

నియోజకవర్గం-కొవ్వూరు

తానేటి వనిత (ఎస్సీ)

వయసు: 49 సంవత్సరాలు విద్యార్హత: ఎమ్మెస్సీ జువాలజీ

రాజకీయ నేపథ్యం: గోపాలపురం ఎమ్మెల్యేగా తెదేపా నుంచి రెండుసార్లు గెలిచిన జొన్నకూటి బాబాజీరావు కుమార్తెగా రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. తెదేపా నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2013లో వైకాపాలో చేరారు. అప్పటి నుంచి కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఓడినా 2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి అనితపై భారీ మెజార్టీతో గెలిచారు. వైకాపా ప్రభుత్వ తొలి మంత్రివర్గంలో మహిళాభివృద్ధి- శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

రెండేళ్లపాటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు. తర్వాత తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చారు.

లెక్కల మంత్రికి మళ్లీ అవకాశం

నియోజకవర్గం- డోన్‌

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (ఓసీ)

వయసు: 52 సంవత్సరాలు విద్యార్హత: బీటెక్‌

రాజకీయ నేపథ్యం: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తాత బీవీ శేషారెడ్డి 1955లో డోన్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రి రామనాథరెడ్డి గంథ్రాలయ సంస్థ ఛైర్మన్‌గా, ఒక పర్యాయం సర్పంచిగా పనిచేశారు. బుగ్గన 1995 నుంచి 2006 వరకు రెండు పర్యాయాలు సర్పంచిగా ఉన్నారు. తొలుత తెదేపాలో ఉన్న బుగ్గన వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌లో, తర్వాత వైకాపాలో చేరారు. 2014లో తొలిసారి డోన్‌ ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచి జగన్‌ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తాజాగా మరోమారు అవకాశం దక్కింది.

ఎదురొచ్చిన పదవులు

నియోజకవర్గం-తణుకు

కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ)

వయసు: 57 సంవత్సరాలు విద్యార్హత : పదో తరగతి

రాజకీయ నేపథ్యం: 2004లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి ద్వారకాతిరుమల జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ పదవి చేపట్టారు. 2009లో తణుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 2014 ఎన్నికల ముందు వైకాపాలో చేరి దెందులూరులో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ తణుకు నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

మరోమారు అవకాశం

నియోజకవర్గం- ఆలూరు

గుమ్మనూరు జయరాం (బీసీ)

వయసు: 54 సంవత్సరాలు విద్యార్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ

రాజకీయ నేపథ్యం: 2005లో చిప్పగిరి నుంచి తెదేపా తరఫున జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వైకాపాలో చేరారు. 2014, 2019ల్లో ఆలూరు నుంచి రెండుసార్లు వైకాపా అభ్యర్థిగా గెలుపొందారు. జగన్‌ కేబినెట్‌లో కార్మిక, ఉపాధి శిక్షణ మంత్రిగా పని చేశారు. ఇప్పుడు మరోసారి కొనసాగింపు దక్కింది.

విపక్షాలపై దూకుడుతోనే..

నియోజకవర్గం- పెడన

జోగి రమేష్‌ (బీసీ)

వయసు: 52 సంవత్సరాలు విద్యార్హత: బీఎస్సీ

రాజకీయ నేపథ్యం: కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఆర్టీసీ రీజనల్‌ ఛైర్మన్‌గానూ, రైల్వేబోర్డు సభ్యుడిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. 2009లో తొలిసారిగా పెడన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో మైలవరం నుంచి వైకాపా టికెట్‌పై పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెడన నుంచి మళ్లీ విజయం సాధించారు.

ఉండవల్లిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై అనుచరులతో కలిసి దాడికి ప్రయత్నించటం వివాదాస్పదమైంది. విపక్ష నేతలపై తీవ్రస్థాయి విమర్శలతోనే అధిష్ఠానానికి దగ్గరయ్యారు.

చదువుల్లో స్టేట్‌ ర్యాంకర్‌

నియోజకవర్గం-పలాస

సీదిరి అప్పలరాజు (బీసీ)

వయసు: 42 సంవత్సరాలు విద్యార్హత: ఎంబీబీఎస్‌

రాజకీయ నేపథ్యం: కుటుంబానికి రాజకీయ నేపథ్యమేమీ లేదు. 2017లో జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పలాసలో తెదేపా అభ్యర్థి గౌతు శిరీషపై విజయం సాధించారు. మత్స్యకార వర్గానికి చెందిన ఈయనను జగన్‌ 2020 జులైలో తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇప్పుడు మరోసారి మంత్రిగా కొనసాగిస్తూ సీˆఎం నిర్ణయం తీసుకున్నారు.

ఉన్నత విద్యావంతుడు. ఏపీఆర్‌జేసీలో స్టేట్ 2వ ర్యాంకు, ఎంసెట్లో స్టేట్ 13వ ర్యాంకు సాధించారు. ఎంబీబీఎస్‌లో రెండు బంగారు పతకాలు పొందారు. 26 ఏళ్ల వయసులోనే కేజీహెచ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌గా ఉద్యోగం సంపాదించారు. 2007లో పలాస-కాశీబుగ్గలో ఆసుపత్రి స్థాపించారు.

37 ఏళ్లకే మంత్రి పదవి

నియోజకవర్గం అనకాపల్లి

గుడివాడ అమర్‌నాథ్‌ (ఓసీ)

వయసు : 37 సంవత్సరాలు విద్యార్హత: బీటెక్‌

రాజకీయ నేపథ్యం: ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గుడివాడ గురునాథరావు కుమారుడిగా ఆయన నుంచి రాజకీయ వారసత్వాన్నీ అందిపుచ్చుకున్నారు. 21 ఏళ్ల వయసులోనే 2007లో తెదేపా నుంచి విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 2014 ఎన్నికల ముందు వైకాపాలో చేరారు. అనకాపల్లి ఎంపీగా పోటీచేసి తెదేపా ఎంపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి విశాఖపట్నం నగర, గ్రామీణ వైకాపా జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2019లో అనకాపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి తెదేపా అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణపై గెలిచారు. ఇటీవల వైకాపా జిల్లా అధ్యక్షునిగానూ బాధ్యతలు స్వీకరించారు.

కార్పొరేటర్‌ నుంచి డిప్యూటీ సీఎం వరకు..

నియోజకవర్గం-కడప

షేక్‌ బేపారి అంజాద్‌ బాషా (మైనార్టీ)

వయసు: 50 సంవత్సరాలు విద్యార్హత: డిగ్రీ (పూర్తికాలేదు)

రాజకీయ నేపథ్యం: 2005లో కడప నగరపాలక సంస్థకు జరిగిన మొదటి ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలుపొందారు. వైఎస్‌ మరణానంతరం రాజకీయ పరిణామాల్లో వైఎస్‌ కుటుంబానికి నమ్మకమైన మైనార్టీ నాయకుడిగా మారారు. 2014లో వైకాపా తరఫున కడప ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జగన్‌ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు.

అంజాద్‌బాషా తాత, పెదనాన్న కడప జిల్లా సిద్దవటం సర్పంచులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. చిన్నాన్న నబీసాహెబ్‌ 1967లో కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వాగ్ధాటి, వ్యవహారశైలితో..

నియోజకవర్గం-సత్తెనపల్లి

అంబటి రాంబాబు (ఓసీ)

వయసు: 65 ఏళ్లు విద్యార్హత: బీఏ, బీఎల్‌

రాజకీయ నేపథ్యం: కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1988లో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్‌సెల్‌ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. 1989లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999ల్లో రెండుసార్లు ఓటమి చవిచూశారు. 1991 నుంచి 1994 వరకు నెడ్‌క్యాప్‌ ఛైర్మన్‌గా, 2005 నుంచి 2007 వరకు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా పనిచేశారు. వైకాపా ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014లో సత్తెనపల్లి నుంచి ఓడిపోయినా గత ఎన్నికల్లో అక్కడి నుంచే గెలిచారు.

వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా విపక్షాలపై విరుచుకుపడటంలో ముందుంటారు. తన వాగ్ధాటితో, వ్యవహారశైలితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

ఐదోసారి మంత్రిగా..

నియోజకవర్గం-అమలాపురం

పినిపే విశ్వరూప్‌ (ఎస్సీ)

వయసు: 60 సంవత్సరాలు విద్యార్హత: బీఎస్సీ, బీఈడీ

రాజకీయ నేపథ్యం: 1987లో కాంగ్రెస్‌లో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. ముమ్మిడివరం నుంచి 1998 ఉప ఎన్నికలో, 1999 సాధారణ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2004లో ముమ్మిడివరం నుంచి, 2009లో అమలాపురం నుంచి గెలుపొందారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2013లో వైకాపాలో చేరారు. 2014 ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

తొలిసారి గెలిచి మంత్రి పదవి

నియోజకవర్గం-కళ్యాణదుర్గం

కె.వి.ఉషశ్రీచరణ్‌ (బీసీ)

వయస్సు: 46 విద్యార్హత: ఎంఎస్సీ పీహెచ్‌డీ

రాజకీయ నేపథ్యం: కర్ణాటకకు చెందిన ఉషశ్రీ అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో స్థిరపడ్డారు. 2012లో తెదేపాతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2013లో వైకాపాలో చేరి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీచేసి గెలుపొందారు.

పాలనలో అనుభవానికి ప్రాధాన్యం

నియోజకవర్గం-శ్రీకాకుళం

ధర్మాన ప్రసాదరావు (బీసీ)

వయసు: 65 సంవత్సరాలు విద్యార్హత: ఇంటర్మీడియట్

రాజకీయ నేపథ్యం: విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. 1983లో స్వగ్రామమైన మబుగాం పంచాయతీ సర్పంచిగా ఎన్నికయ్యారు. 1987లో పోలాకి ఎంపీపీగా పనిచేశారు. 1989లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 1991-94 కాలంలో చేనేత, జౌళిశాఖ, జలవనరులు, పోర్టులశాఖ మంత్రిగా చేశారు. 1999, 2004, 2009లో హ్యాట్రిక్‌ విజయాలతో రెవెన్యూ వంటి కీలక మంత్రి పదవులూ దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా, 2019లో మళ్లీ విజయం సాధించారు.

కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది.

చిన్న వయసులోనే అమాత్యయోగం

నియోజకవర్గం-చిలకలూరిపేట

విడదల రజిని (బీసీ)

వయసు: 31 ఏళ్లు 

విద్యాభ్యాసం: ఉస్మానియా వర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సు, హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు

రాజకీయ నేపథ్యం: రజిని మామ విడదల లక్ష్మీనారాయణ చిలకలూరిపేట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా పని చేశారు. అయినా రజిని తెదేపాను వీడి 2018లో వైకాపాలో చేరారు. అక్కడ సీనియర్‌ వైకాపా నాయకుడు మర్రి రాజశేఖర్‌ను కాదని 2019 ఎన్నికల్లో వైకాపా టికెట్‌ దక్కించుకున్నారు. తెదేపా నేత పత్తిపాటి పుల్లారావుపై గెలిచారు.

చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన తొలి బీసీ అభ్యర్థి. ఎమ్మెల్యేగా గెలిచేనాటికి ఆమె వయసు 28 ఏళ్లే. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ముందుంటారు.

విధేయతకు పట్టం

నియోజకవర్గం-నగరి

ఆర్‌.కె.రోజా (ఓసీ)

వయసు: 51 సంవత్సరాలు విద్యార్హత: బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతుండగా మానేసి సినీరంగ ప్రవేశం చేశారు.

రాజకీయ నేపథ్యం: 1999లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైకాపాలో చేరి, నగరి నియోజకవర్గం నుంచి 2014లో తెదేపా అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడిపైనా, 2019లో ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్‌పైనా గెలుపొందారు. 2019 జులై నుంచి రెండేళ్లపాటు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా పనిచేశారు.

డిగ్రీ చదువుతుండగానే సినీరంగ ప్రవేశం చేసి పలు చిత్రాల్లో కథానాయికగా నటించారు. దర్శకుడు సెల్వమణిని వివాహమాడారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తెదేపా, వైకాపాల్లో మహిళావిభాగం అధ్యక్షురాలిగా పనిచేయడం విశేషం.

ఆచార్యుడి నుంచి అమాత్యుడిగా..

నియోజకవర్గం-వేమూరు

మేరుగ నాగార్జున (ఎస్సీ)

వయసు: 58 సంవత్సరాలు విద్యార్హత: ఎంకాం, ఎంఫిల్‌, పీహెచ్‌డీ

రాజకీయ నేపథ్యం: విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తూ రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లో వేమూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత వైకాపాలో చేరి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా పని చేశారు. 2014లో వైకాపా తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా రెండేళ్లపాటు పనిచేశారు.

వార్డు సభ్యుడి నుంచి మొదలై...

నియోజకవర్గం-మాడుగుల

బూడి ముత్యాలనాయుడు (బీసీ)

వయసు: 60 సంవత్సరాలు విద్యార్హత: ఇంటర్మీడియట్‌

రాజకీయ నేపథ్యం: 1991లో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రచారదళ్‌ కన్వీనరుగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుడి స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగారు. 1988 నుంచి 1991 వరకు తారువ వార్డు సభ్యుడిగా, గ్రామ ఉప సర్పంచిగా ఉన్నారు. తర్వాత సర్పంచిగా, ఎంపీటీసీ సభ్యుడిగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా మాడుగుల నుంచి గెలిచి, శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడిగా వ్యవహరించారు. శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ సభ్యుడిగా, బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2019లో రెండోసారి గెలిచి, ప్రభుత్వ విప్‌ పదవి చేపట్టారు. తాజాగా మంత్రిపదవి దక్కించుకున్నారు.

ముత్యాలనాయుడు కుమార్తె అనూరాధ కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.

వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి..

నియోజకవర్గం-తాడేపల్లిగూడెం

కొట్టు సత్యనారాయణ (ఓసీ)

వయసు: 67 సంవత్సరాలు విద్యార్హత: ఇంటర్మీడియట్‌

రాజకీయ నేపథ్యం: 1994లో తొలిసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లోనూ పరాజయంపాలైనా 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తెదేపాలో చేరినా సీటు రాకపోవడంతో వెంటనే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైకాపాలో చేరి, 2019లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

రాజకీయ నేపథ్యం లేకున్నా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా

నియోజకవర్గం-సాలూరు

పీడిక రాజన్నదొర (ఎస్టీ)

వయసు: 58 సంవత్సరాలు విద్యార్హత: ఎంఏ

రాజకీయ నేపథ్యం: ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. 2004లో జీసీసీ సీనియర్‌ మేనేజర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఓడినా కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే అయ్యారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2014, 19ల్లో వైకాపా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఒక్కసారి కూడా ఓటమి పాలవలేదు.

2004 ఎన్నికల్లో రాజన్నదొరపై తెదేపా అభ్యర్థి ఆర్పీ భంజ్‌దేవ్‌ విజయం సాధించారు. భంజ్‌దేవ్‌ గిరిజనేతరుడని, ఎస్టీ స్థానంలో ఆయన ఎన్నిక చెల్లదని రాజన్నదొర కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలోనూ రుజువు చేయడంతో సమీప ప్రత్యర్థిగా ఉన్న రాజన్నదొరను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. ఇలా రాజన్నదొర 2006లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

సామాజిక సమీకరణాలు కలిసొచ్చాయి..

నియోజకవర్గం-తుని

దాడిశెట్టి రాజా (ఓసీ)

వయసు: 45 సంవత్సరాలు విద్యార్హత: బీఏ

రాజకీయ నేపథ్యం: 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2010లో వైకాపాలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీచేసి.. రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌ హోదాలో ఉన్నారు.

రాజకీయ కుటుంబం నుంచి వచ్చి..

నియోజకవర్గం-సర్వేపల్లి

కాకాణి గోవర్ధన్‌రెడ్డి (ఓసీ)

వయస్సు: 58 ఏళ్లు విద్యార్హత: ఎంఏ, పీహెచ్‌డీ

రాజకీయ నేపథ్యం: తండ్రి దివంగత కాకాణి రమణారెడ్డి 18 ఏళ్లు పొదలకూరు సమితి అధ్యక్షుడిగా పని చేశారు. తల్లి లక్ష్మీకాంతమ్మ తోడేరు సర్పంచిగా 25 ఏళ్లు కొనసాగారు. గుత్తేదారుగా ఉన్న గోవర్ధన్‌రెడ్డి తొలిసారిగా సైదాపురం నుంచి కాంగ్రెస్‌ తరఫున జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2006లో జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైకాపాలో చేరి 2014, 2019ల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.



◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

 Ap cabinet : కేబినెట్ విస్తరణపై జగన్ తుది కసరత్తు .. 8 మంది పాతవారిని కొనసాగించే అవకాశం !

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ వైకాపా నేతల్లో టెన్షన్‌ పెరుగుతోంది.

తమ నాయకుడికి మంత్రి పదవి వరిస్తుందో లేదోనని పలువురు కీలక నేతల అనుచరులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. మరో వైపు ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో ఎవరిని కంటిన్యూ చేస్తారనే దానిపై కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో మంత్రుల జాబితా రూపకల్పనలో జగన్‌ నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంతో సమావేశమై కేబినెట్‌ విస్తరణపై చర్చించారు. సీఎంతో భేటీ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చివరి క్షణం వరకూ ఈ చర్చలు కొనసాగుతాయని చెప్పడంతో వైకాపా శ్రేణుల్లో ఉత్కంఠ రెట్టింపైంది.

కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులకు రేపు సాయంత్రానికి అధికారికంగా ఆహ్వానాలు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సీఎంవో అధికారులు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు. మంత్రుల రాజీనామాలతో పాటు కొత్త మంత్రుల జాబితా కూడా సీల్డ్‌ కవర్‌లో గవర్నర్‌కు పంపనున్నారు. పాత కేబినెట్‌ నుంచి 8 నుంచి 10 మంది మంత్రులను కొనసాగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కుల సమీకరణ, కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకొని మిగతావారిని ఎంపిక చేసేందుకు తుది కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న 24 మంది మంత్రుల నుంచి రాజీనామా లేఖలు తీసుకోవడంతో పాతవారిలో ఎవరిని మంత్రివర్గంలో కొనసాగిస్తారనే దానిపై వైకాపాలో జోరుగా చర్చ జరుగుతోంది.


రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని సీఎం ముందుగా ప్రకటించినట్టే చేస్తారా? అనే దానిపై ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. అయితే, ఇటీవల రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లాకో మంత్రి పదవి వస్తుందని మాత్రం అందరూ భావిస్తున్నారు. జిల్లాకో మంత్రి పదవి చొప్పున ఇస్తే... సామాజిక సమీకరణల్లో తేడాలు వస్తున్నట్టు సమాచారం. దీంతో కొందరు పాతవారిని కొనసాగించాలనే దానిపై, సామాజిక సమీకరణలు, జిల్లాల వారీగా మంత్రి పదవుల పంపకంపై సమతూకం పాటించేందుకు తీవ్ర కసరత్తు జరుగుతోందని వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు కూడా రానుండంటంతో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని కేబినెట్‌ కూర్పు ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద 2024 ఎన్నికల్లో వైకాపాను విజయతీరాలకు చేర్చే జగన్‌ జట్టు ఎలా ఉంటుందో మరి కొన్ని గంటల్లో తేలనుంది.

Thanks for reading AP Cabinet Latest updates

No comments:

Post a Comment