ఇంగ్లీష్ మీడియం వల్లే ఉత్తీర్ణత తగ్గుదల
♦️పది ఫెయిలైన వారికి విద్యా సంవత్సరాన్ని వృథా కానివ్వం
♦️సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ మీడియం అమలు వల్ల తొలుత సవాళు _, ఇబ్బందులు ఉంటాయనే అంశాన్ని ముఖ్యమంత్రి కూడా చెప్పారని గుర్తు చేశారు. మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ ఏడాది పది పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందనే విమర్శలపై సజ్జల స్పందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా పోటీ పరీక్షల్లో ముందుకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇంగ్లీష్ మీడియంతో దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా కఠినంగా వ్యవహరించామని, అది తప్పా? అని ప్రశ్నించారు. పారదర్శకంగా, నిష్పాక్షికంగా పది పరీక్షలు జరిపామా లేదా అనేది ముఖ్యమని అన్నారు. ఈ ఏడాది మాల్ ప్రాక్టీస్ కు బ్రేక్ పడటం వల్లే ఉత్తీర్ణతశాతం తగ్గిందన్నారు. ఇంతకాలం 90 శాతంపైగా ఉత్తీర్ణత ఎలా వచ్చిందో విమర్శలు చేసేవారు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండేళ్లపాటు కోవిడ్ వల్ల విద్యాసంస్థలు సరిగ్గా నడవలేదని, రెండేళ్లుగా పరీక్షలు లేకపోవడం వల్ల పోటీకి అవసరమైన స్పూర్తి విద్యార్థుల్లో తగ్గి ఉండొచ్చన్నారు. పది ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇన్స్టెంట్, బెటర్ మెంట్ పరీక్షలు పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ చర్యలతో పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
Thanks for reading Decrease in pass rate due to English medium
No comments:
Post a Comment