CBSE Exams : మారనున్న సీబీఎస్ఈ పరీక్షల తీరు .. 2023 నుంచి వచ్చే మార్పులివే .. !
సీబీఎస్ఈ బోర్డు కార్యదర్శి అనురాగ్ త్రిపాఠీ
దిల్లీ: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో కీలక మార్పులకు సీబీఎస్ఈ (CBSE) ఇప్పటికే శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
అయితే, వచ్చే ఏడాది నుంచి ఈ పద్ధతిని (Assessment Process) పూర్తిస్థాయిలో అన్ని పాఠశాలల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా విద్యార్థుల నైపుణ్యాలు, సామర్థ్యాల ఆధారంగా వారి ప్రతిభను సమగ్రంగా మదింపు చేసేందుకు బహుముఖ మార్పులు తీసుకువస్తున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది. జాతీయ విద్యా విధానం-2020 ఆధారంగానే విద్యార్థుల నైపుణ్యాల మదింపు ప్రక్రియలో ఈ మార్పులు ఉండనున్నట్లు బోర్డు వెల్లడించింది.
జాతీయ విద్యా విధానానికి (NEP-2020) అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలను అంచనా వేసే సంస్కరణలను సీబీఎస్ఈ ఇప్పటికే మొదలుపెట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద ప్రయెగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో దీన్ని మొదలుపెట్టింది. వాటి నుంచి మెరుగైన ఫలితాలు రావడంతోపాటు ఆ అనుభవాల ఆధారంగా వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో వీటిని అమలు చేయాలని నిర్ణయించినట్లు ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీబీఎస్ఈ సెక్రటరీ అనురాగ్ త్రిపాఠీ వివరించారు. ఈ క్రమంలో సీబీఎస్ఈ పరీక్షా విధానంలో వచ్చే మార్పులను ఆయన వెల్లడించారు.
అన్ని సబ్జక్టుల్లో 20శాతం ఇంటర్నల్..
విద్యార్థుల సామర్థ్యాన్ని ఏడాది చివర కేవలం మూడు గంటల్లో సమగ్రంగా అంచనా వేయలేం. అందుకే విద్యార్థి నైపుణ్యాలను అంచనా వేసే పద్ధతి ఏడాదిపాటు కొనసాగాలి. ఈ క్రమంలో ప్రాక్టికల్ పరీక్షలు లేని పేపర్లకూ 20శాతం ఇంటర్నల్ అసెస్మెంట్ ఉండాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతోపాటు సంబంధిత వర్గాల ఆధారంగా 20శాతం మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఇంటర్నల్ ప్రాజెక్టులు, సామాజిక సేవ, క్రీడలు కూడా వీటిలో ఉంటాయని సీబీఎస్ఈ సెక్రటరీ వెల్లడించారు.
ప్రశ్నా పత్రంలో కీలక మార్పులు..
ప్రశ్నాపత్రాల్లోనూ నిర్మాణాత్మక మార్పులు ఉంటాయి. ముఖ్యంగా ప్రశ్నల సంఖ్య 33శాతం పెరగనుంది. ప్రశ్నాపత్రం పరిమాణం పెరిగినప్పటికీ.. వాటిలో తగిన ప్రశ్నలను ఎంచుకునే సౌలభ్యం విద్యార్థులకు కలుగుతుంది.
ప్రశ్నల విధానంలోనూ మార్పు..
ప్రశ్నలు అడిగే రకంలోనూ మార్పులు రానున్నాయి. ముఖ్యంగా నైపుణ్యం, సమర్థతను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. వీటికి జవాబులు కూడా పుస్తకాల్లో ఉండవు. వీటివల్ల విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించే వీలుంటుంది. ఇందుకోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు మరింత సాధన చేయాల్సి ఉంటుంది.
సామర్థ్య సర్వే..
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు సీబీఎస్ఈ మరో మార్పును తీసుకురానుంది. ఇందుకోసం ఇప్పటివరకు ఎటువంటి ప్రక్రియ లేదు. ఇందులో భాగంగా 3, 5, 8 తరగతుల విద్యార్థులకు సామర్థ్య సర్వే పరీక్ష నిర్వహించడం. అయితే, ఇవి మార్కుల ఆధారంగా ఉండవు. ఈ పరీక్షల సహాయంతో విద్యార్థుల అభ్యసన స్థాయిలు, గతంతో పోలిస్తే మెరుగైన విధాన్ని ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు సీబీఎస్ బోర్డు తెలియజేస్తుంది. తద్వారా మునుపటి తరగతుల అభ్యసన నష్టాలను మరుసటి తరగతుల్లో సరిచేసుకునే వీలు కలుగుతుంది.
360 డిగ్రీ ప్రోగ్రెస్ కార్డ్..
విద్యార్థుల సామర్థ్యాలకు సంబంధించి ప్రత్యేకమైన ప్రోగ్రెస్ కార్డులను సీబీఎస్ఈ అందించనుంది. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో వీటిని విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల సామర్థ్యాలను కేవలం టీచర్లే కాకుండా తల్లిదండ్రులు, పీర్ గ్రూప్లతోపాటు విద్యార్థులే సొంతంగా వారి సామర్థ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది. దీన్ని 360 డిగ్రీల కోణంలో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసే కార్డుగా సీబీఎస్ఈ అభివర్ణిస్తోంది.
Thanks for reading CBSE Exams: The pattern of CBSE exams will change from 2023.
No comments:
Post a Comment