Budget-2023: ఆదాయపు పన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు.. వారికి మాత్రమే అవకాశం
2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1గంటా 26నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం సాగింది. వేతన జీవులకు ఊరటనిస్తూ బడ్జెట్లో ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి రూ.7లక్షల వరకూ ఆదాయపు పన్నులో మినహాయింపు ఇచ్చారు.
బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు
బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఆయా లోహల ధరలు పెరగనున్నాయి. అలాగే టైర్లు, సిగరెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహన ధరలు భారీగా తగ్గనున్నాయి. వీటితో పాటు, టీవీ, మొబైల్, కిచెన్ చిమ్నీ ధరలు కూడా తగ్గుతాయి.
ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి..? ఏవి పెరుగుతాయి..?
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ 2023 (Budget 2023)ను ప్రవేశపెట్టారు. దీంతో పలు వస్తువుల ధరలు పెరగనుండగా.. మరికొన్ని తగ్గనున్నాయి.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్ (Budget 2023)ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేయడంతో కీలక వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. బడ్జెట్-2023 ప్రకారం.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి..? వేటిపై భారం పడనుందనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే..
* కెమెరా లెన్సులపై కస్టమ్స్ సుంకంపై ఏడాది పాటు మినహాయింపు
* టీవీ పార్టులపై ప్రస్తుతం ఉన్న 5శాతం కస్టమ్స్ సుంకాన్ని 2.5శాతానికి తగ్గించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం
* వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో వీటి ధర పెరిగే అవకాశం
* లిథియం అయాన్ బ్యాటరీలకు అవసరమైన సామగ్రిపైనా కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు
* రొయ్యల ఆహార ఉత్పత్తుల దిగుమతిపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. దీంతో దేశీయంగా తయారు చేసే వాటి ధరలు తగ్గుతాయి
ధరలు తగ్గేవి
* మొబైల్, ల్యాప్టాప్, డీఎస్ఎల్ఆర్ల కెమెరా లెన్సులు
* టీవీ ప్యానెల్ పార్టులు
* లిథియం అయాన్ బ్యాటరీలు
* ఎలక్ట్రిక్ వాహనాలు
* దేశీయంగా ఉత్పత్తి చేసే రొయ్యల ఆహారం
* డైమండ్ల తయారీ వస్తువులు
పెరిగేవి
* బంగారం, ప్లాటినంతో తయారు చేసే వస్తువులు
* వెండి ఉత్పత్తులు
* సిగరెట్లు, టైర్లు
* దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు
* రాగి తుక్కు
* రబ్బర్
ముగిసిన బడ్జెట్ ప్రసంగం
2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1గంటా 26నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం సాగింది.
ఆదాయపన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు
ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.5లక్షల ఆదాయపు పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది.
* రూ.9లక్షల నుంచి రూ.12లక్షల వరకూ 15శాతం పన్ను
* రూ.12లక్షల నుంచి రూ.15లక్షల వరకూ 20శాతం పన్ను
* రూ.15. లక్షలకు పైబడిన వారికి 30శాతం పన్ను వర్తిస్తుంది.
కొత్త పన్ను విధానం.. రూ.7లక్షల వరకూ రాయితీ.. శ్లాబుల కుదింపు
ఆదాయపన్ను విషయంలో ఈ సారి కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు యత్నించింది. దీంతోపాటు కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చేవారికి సంబంధించి ముఖ్య ప్రకటన చేసింది.
వ్యక్తిగత ఆదాయపు పన్ను (Income tax) విధానానికి సంబంధించి ఈ సారి బడ్జెట్ (union budget 2023)లో కీలక మార్పులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక నుంచి రిటర్న్లు దాఖలు చేసే సమయంలో ‘కొత్త ఆదాయ పన్ను విధానం’ డీఫాల్ట్ ఆప్షన్గా వస్తుంది. పాత పన్ను విధానంలో ఉన్న వారు ఎప్పటిలా అందులో పొందుతున్న రాయితీలను మునుపటిలా కొనసాగించవచ్చు. వారు కోరుకుంటే కొత్త పన్ను పరిధిలోకి రావచ్చు. కొత్త పన్ను విధానానికి సంబంధించి బడ్జెట్లో చేసిన మార్పులు ఈ విధంగా ఉన్నాయి...
కొత్త పన్ను విధానంలో గతంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ ఇచ్చేవారు. కానీ, ఈ సారి ఆ రిబేట్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.7లక్షలకు పెంచారు. రూ.7లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు.
కొత్త ఆదాయ పన్ను విధానంలోని శ్లాబుల సంఖ్యను కూడా తగ్గించారు. గతంలో 6 శ్లాబులు ఉండగా.. వాటిని తాజాగా 5కు కుదించారు.
రూ.3 లక్షల వరకు ఎటువంటి పన్ను విధించరు.
రూ.3-6 లక్షల వరకు 5శాతం పన్ను విధిస్తారు.
రూ.6-9 లక్షల వరకు 10శాతం పన్ను చెల్లించాలి.
రూ.9-12 లక్షలకు 15శాతం, రూ.12-15 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20శాతం పన్ను కట్టాలి.
కొత్త విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటిన వారిపై అత్యధికంగా 30శాతం పన్ను రేటు విధిస్తారు.
ఉదాహరణకు ‘ఎ’ అనే వ్యక్తి ఏడాదికి రూ.7 లక్షల ఆదాయం పొందితే.. తొలి 3 లక్షలకు ఎలాంటి పన్ను ఉండదు. తర్వాత 4 లక్షలకు పై శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ సారి ఆ మొత్తంపై రిబేట్ ఇచ్చారు. దీంతో రూ.7లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
వార్షికాదాయం రూ.15 లక్షలు ఉంటే రూ.1.5లక్షల వరకు పన్ను చెల్లించాల్సి రావచ్చు. గతంలో ఇది రూ. 1.87 లక్షల వరకు ఉంది. అత్యధిక ఆదాయపన్నుపై సర్ఛార్జి రేటును 37శాతం నుంచి 25శాతానికి తగ్గించారు.
* పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.52,500కు పెంచారు.
సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకం పరిమితి పెంపు
సీనియర్ సిటిజన్స్లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్ పరిమితి పెంచుతున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితిని డబుల్ చేసి, రూ.30లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.
మహిళల కోసం కొత్త స్కీమ్
ఆజాదీకా అమృత మహోత్సవ్లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు.
ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయింపు
* కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు, అక్కడ సాగు రంగానికి రూ.5,300 కోట్లు
* దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోర్ట్లు, హెలిప్యాడ్ల నిర్మాణం
* 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్ల ఏర్పాటు
* పీఎం కౌశల్ పథకం కింద 4లక్షల మందికి శిక్షణ.
* దేశంలో 50 టూరిస్ట్ స్పాట్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
* దేఖో ఆప్నా దేశ్ పథకం ప్రారంభం
* స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్
లోక్సభలో నవ్వుల్ నవ్వుల్
పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. తుక్కు విధానం గురించి ఆమె ప్రకటన చేస్తూ పొల్యూటెడ్ వెహికల్ అనబోయి.. పొలిటికల్ అని పలికారు. దీంతో అధికార సభ్యులతో పాటు, విపక్ష సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. దీంతో ఒక్కసారిగా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పొరపాటును గ్రహించిన నిర్మలా సీతారామన్ సైతం నవ్వుతూ తప్పును సవరించుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Thanks for reading Budget-2023 Highlights
No comments:
Post a Comment