నామమాత్ర ఫీజుతో నాణ్యమైన విద్య
* కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రకటన
విద్యార్థుల్లో సమగ్ర వికాసానికి చిరునామాగా నిలుస్తున్నాయి.. కేంద్రీయ విద్యాలయాలు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే, ప్లస్ 2 వరకు నిశ్చింతగా చదువుకోవచ్చు. సీబీఎస్ఈ కరిక్యులమ్తో ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను నామమాత్రపు రుసుముతో పొందవచ్చు. సువిశాల ప్రాంగణాలు, సుశిక్షితులైన బోధన సిబ్బంది, ఆటస్థలం, అన్ని సౌకర్యాలు...కేవీల ప్రత్యేకత. ఈ సంస్థల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!
చిన్నారుల్లో సమగ్ర వికాసం ఆశించే తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్చడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటిలో సీటు పొందడం కష్టమైనప్పటికీ, ఎంపిక పారదర్శకం కాబట్టి ఒకటో తరగతిలో తమ పిల్లలను చేర్చాలనుకున్నవారు ప్రయత్నించవచ్చు. మిగిలిన తరగతుల్లో ఖాళీలు ఉంటేనే అవకాశం కల్పిస్తారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రకారం ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆరేళ్లు పూర్తవ్వడం తప్పనిసరి. గత విద్యా సంవత్సరం (2022-23) నుంచి కేంద్రీయ విద్యాలయాలు ఈ నిబంధనను అమలు చేస్తున్నాయి. అలాగే గతంలో గరిష్ఠంగా ఏడేళ్లలోపు వారికే ప్రథమ తరగతిలో ప్రవేశం లభించేది. ఇప్పుడు ఎనిమిదేళ్ల వరకు ఆ అవకాశం ఉంది.
సీట్లు ఇలా...
ప్రతి పాఠశాలలోనూ ఒకటో తరగతిలో ఒక సెక్షన్ ఉంటుంది. ఒక్కో సెక్షన్లోనూ ఆ పాఠశాల ఉన్న ప్రాంతాన్ని బట్టి కనీసం 20 నుంచి 60 వరకు సీట్లు లభిస్తున్నాయి. పలు పాఠశాలల్లో ఫస్ట్ క్లాస్లో రెండు నుంచి ఐదు సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్ల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సెక్షన్లు, షిఫ్ట్ల కారణంగా ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం దక్కుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను ముందుగా భర్తీ చేస్తారు. ఇందుకోసం వచ్చిన అన్ని దరఖాస్తులను కలిపి డ్రా తీస్తారు. ఈ విధానంలో ఎంపికైనవారికి ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు కేటాయించారు. అలాగే 27 శాతం సీట్లు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్తో నింపుతారు. రెండు సీట్లు సింగిల్ గర్ల్ చైల్డ్ (తల్లిదండ్రులకు సంతానంగా ఒక కుమార్తె మాత్రమే ఉన్నవారు)కి ఉన్నాయి. దివ్యాంగులకు 3 శాతం సీట్లు లభిస్తున్నాయి. వీటిని ఆ సమూహానికి చెందిన దరఖాస్తుల నుంచి లాటరీతో భర్తీ చేస్తారు. ఇంకా సీట్లు మిగిలితే వచ్చిన దరఖాస్తులన్నీ కలిపి లాటరీ విధానంలోనే కేటాయిస్తారు.
ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న ఖాళీలకు ఆ పాఠశాల ప్రిన్సిపల్, కమిటీ సభ్యుల సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో చేరడానికి పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ప్లస్ 1లో ప్రవేశాలు పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులతో చేపడతారు. తొలి ప్రాధాన్యం కేంద్రీయ విద్యాలయాల్లో చదివినవారికే ఇస్తారు. సీట్లు మిగిలితే ఇతర బోర్డులవారికి అవకాశం కల్పిస్తారు.
ఎవరికి ప్రాధాన్యం?
సీట్ల కేటాయింపులో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ, పారా మిలటరీలో పనిచేస్తున్నవారి పిల్లలకు ప్రాధాన్యం లభిస్తుంది. తరచూ బదిలీలు జరిగేవారు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు...మొదలైన చోట్ల పనిచేసే ఉద్యోగుల చిన్నారులకు ఆ తర్వాతి ప్రాధాన్యం. ప్రతి ఎంపీ (లోక్సభ) తన పరిధిలోని కేంద్రీయ విద్యాలయకు ఏడాదికి పది మందిని సిఫార్సు చేయవచ్చు. రాజ్యసభ సభ్యులైతే వారు ప్రాతినిధ్యం వహిస్తోన్న రాష్ట్రం పరిధిలో ఉన్న కేవీల్లోకి పది మందికి అవకాశం కల్పించవచ్చు. ఇలా ఎంపీలు ఎంపిక చేసిన విద్యార్థుల వివరాలను కేవీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి ఆ కేవీలకు అనుమతి పత్రాలు వస్తే సీట్లను కేటాయిస్తారు. కేంద్ర మానవ వనరుల శాఖ, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఉన్నతోద్యోగులు, రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్...విభాగాలవారీ కొన్నేసి సీట్లు చొప్పున కోటా ఉంటుంది.
దరఖాస్తులు
ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయసు మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు పూర్తికావాలి (ఏప్రిల్ 1 నాటికి పూర్తయినా పరిగణనలోకి తీసుకుంటారు) అలాగే ఎనిమిదేళ్లకు మించరాదు. తర్వాతి తరగతులకు ఒక్కో ఏడాదీ కలపాలి. దరఖాస్తుకి ముందుగా ప్రాథమిక సమాచారం నమోదు చేయాలి. ఆ తర్వాత లాగిన్తో మిగిలిన వివరాలు చేర్చాలి. వీటికి అవసరమైన పత్రాలు జత చేయాలి. అన్ని వివరాలు, పత్రాలు నమోదుచేసిన తర్వాత వాటిని ఒకసారి సరిచూసుకుని సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసుకున్నప్పుడే చేరాలనుకుంటున్న మూడు కేవీలను ఎంపిక చేసుకోవాలి. మొదటి, రెండో, మూడో ప్రాధాన్యంగా వీటిని నమోదు చేయాలి.
ఫీజులిలా...
విద్యా హక్కు చట్టం ద్వారా ప్రవేశాలు పొందినవారు ప్లస్ 2 వరకు ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. వీరికి పాఠ్యపుస్తకాలు, నోట్సులు, యూనిఫారం, పాఠశాలకు చేరడానికి అవసరమయ్యే ప్రయాణ ఖర్చులు సైతం చెల్లిస్తారు. కేవీల్లో చేరిన బాలికలు ఫీజు చెల్లించనవసరం లేదు. బాలురైతే ఏడో తరగతి వరకు ఫీజు ఉండదు. ఎస్సీ, ఎస్టీ బాలబాలికలకు ఫీజు లేదు. 9, 10 తరగతులకు బాలురు నెలకు రూ.200 ఫీజు చెల్లించాలి. 11, 12 తరగతులకు కామర్స్, హ్యుమానిటీస్ కోర్సులైతే రూ.300, సైన్స్ కోర్సులకు రూ.400 చెల్లించాలి. కంప్యూటర్ తరగతులు ఉంటే అన్ని విభాగాల విద్యార్థులూ నెలకు రూ.వంద చెల్లించాలి. 11, 12 తరగతుల వారికిది రూ.150. విద్యాలయ వికాస నిధిలో భాగంగా అన్ని తరగతుల విద్యార్థులూ నెలకు రూ.500 చెల్లించాలి. అయితే.. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారు, యుద్ధంలో మరణించిన సైనికుల పిల్లలు, ఏకైక కుమార్తె సంతానంగా ఉన్నవారు చెల్లించనవసరం లేదు.
ముఖ్య తేదీలు
* ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు: ఏప్రిల్ 17 సాయంత్రం 7 వరకు స్వీకరిస్తారు.
* రెండు, ఆపైన తరగతుల్లో ఖాళీ సీట్లలో ప్రవేశానికి: ఏప్రిల్ 3 నుంచి 12 వరకు సంబంధిత విద్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* ప్లస్ 1లో ప్రవేశాలు: పదో తరగతి ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత నుంచి మొదలవుతాయి.
వెబ్సైట్: https://kvsangathan.nic.in
Kendriya Vidyalayas Admissions 2023-24 Important Links:
KVS Admissions Android App click here soon
KVS Class 1 Apply Online click here
REGISTRATION FORM CLASS-II ONWARDS
KVS Admission Guidelines 2023-24
KVS Admission Notification, Schedule 2023 click here
Thanks for reading Kendriya Vidyalaya Admission 2023-24 - Eligibility, Dates, Exam details, Merit list
No comments:
Post a Comment