ఆస్తుల వీలునామా పక్కాగా ఎలా రూపొందించాలి?
తమ తదనంతరం వారసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆస్తులు పంపిణీ చేయడానికి ‘వీలునామా’ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీలునామా గురించి ఇక్కడ చూడండి.
స్థిర, చరాస్తులు కలిగినవారు తమ తదనంతరం ఆస్తులను కుటుంబానికి అప్పగించడానికి ‘వీలునామా’ రాసి పెడతారు. సరైన వారసులకు ఆస్తి దక్కడంలో ఈ వీలునామా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, ఇందులో చట్టబద్ధమైన వారసుల వివరాలు లేకపోయినా, ఏమైనా లోపాలున్నా.. దీన్ని వారసులు, హక్కుదారులు కోర్టులో సవాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలునామాలో సరైన వారసులు, హక్కుదార్ల వివరాలు తప్పనిసరి. తమ ఆర్థిక ప్రణాళికలో చాలా మంది వ్యక్తులు తక్కువ ప్రాధాన్యం కలిగిన పత్రంగా భావించి వీలునామాకు సంబంధించిన ప్రాముఖ్యతను విస్మరిస్తుంటారు. దీనివల్ల భవిష్యత్లో వారసులకు అనేక సమస్యలు ఏర్పడతాయి.
ప్రాథమిక అవసరం
ఏ వ్యక్తి అయినా వారి మరణానంతరం వారి ఆస్తులను ఎలా పంపిణీ చేయాలనుకుంటున్నారో వివరించే వీలునామాను రూపొందించాలి. వీలునామా కలిగి ఉండడం వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు వారసత్వ ప్రక్రియను సులభతరం చేయొచ్చు. అంతేకాకుండా సుదీర్ఘమైన, ఖరీదైన చట్టపరమైన కోర్టు సమస్యల నుంచి వారసులను తప్పించవచ్చు. వీలునామా ఉంటే ఎగ్జిక్యూటర్ (వీలునామాను నిర్వహించే వ్యక్తి) ఆస్తిని సరైన విధంగా పంపిణీ జరిగేటట్లుగా పరవేక్షించడానికి వీలుంటుంది. ఈ రోజుల్లో డిజిటల్ ‘విల్’ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీలునామా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రాథమిక అవసరమే. భారతీయ వారసత్వ చట్టం ప్రకారం వీలునామా రాసే వ్యక్తి సంతకం చేసినప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు సంతకం చేసి, సాక్షులుగా ఉండే వీలునామాను కలిగి ఉండడం ప్రాథమిక అవసరం.
రిజిస్ట్రేషన్
వీలునామా రిజిస్ట్రేషన్ చేయించాలని వింటూ ఉంటాం. రిజిస్ట్రేషన్ అనేది వీలునామాపై సంతకం చేసే వ్యక్తుల సంతకాలను ప్రామాణీకరించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, వీలునామా నకిలీ కాదని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. రిజిస్టర్ కాకపోయినా వీలునామాలోని విషయాలపై ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రాక్టికల్ లేదా చట్టపరమైన కోణం నుంచి చూస్తే వీలునామాను రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి కాదు.
డిజిటల్ వీలునామా
భారత్లో చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే, వీలునామా సాధారణ కాగితంపై ముద్ర కలిగి ఉండాలి. 18 ఏళ్లు పైబడిన వ్యక్తులు వీలునామా రాయడానికి అర్హులు. కనీసం ఇద్దరు సాక్షులతో పాటు వీలునామా రాసే వ్యక్తి సంతకం తప్పనిసరి. ప్రస్తుతం భారత్లో ఉన్న వీలునామాలకు డిజిటల్ సంతకం చెల్లదు. మీరు ఆన్లైన్లో వీలునామా రాస్తే, ప్రింట్ తీసుకుని సంతకం చేయాలి. ఆన్లైన్ వీలునామా ప్రక్రియను ప్రారంభించే ముందు గుర్తింపు రుజువు, చిరునామా రుజువు సహా అవసరమైన మొత్తం సమాచారాన్ని సేకరించండి. వీలునామాను సమీక్షించడానికి, సవరించడానికి వీలు కల్పించే విశ్వసనీయమైన ఆన్లైన్ ‘విల్’ ప్రొవైడర్లను ఎంచుకోండి.
చట్టబద్ధమైన వారసులు
వీలునామాలో ఉన్న విషయాలపై అభ్యంతరాలుంటే చట్టబద్ధమైన వారసులు కోర్టులో సవాలు చేయొచ్చు. వీలునామాను రిజిస్టర్ చేసినా సరే.. వీలునామా రాసిన వ్యక్తి మరణించినప్పటికీ, అతడు మరణించిన 12 సంవత్సరాల్లోపు చట్టబద్ధమైన వారసులు తమ అభ్యంతరాలను కోర్టులో సవాల్ చేయొచ్చు. వారసులు అంటే మరణించిన వారి పిల్లలు, భార్య/భర్త, తల్లిదండ్రులు, తాతలు, మనుమలు, తోబుట్టువులు. వారసులు మైనరయితే దావా వేయడానికి చట్టబద్ధమైన వయసు 18 సంవత్సరాలు. అందువల్ల మైనర్ తరపున ఒక సంరక్షకుడు లేదా తల్లిదండ్రులు దావా వేయడం సాధ్యమవుతుంది.
ఎగ్జిక్యూటర్
వీలునామా రాసే వ్యక్తి మరణానంతరం పేర్కొన్న సూచనలు, కోరికలను అమలు చేయడానికి.. ఒక ఎగ్జిక్యూటర్ (వీలునామాను నిర్వహించే వ్యక్తి) అవసరం పడుతుంది. ఎగ్జిక్యూటర్.. మీ జీవిత భాగస్వామి, కుటుంబంలో మొదటి సంతానం, ఆఖరి సంతానం, ముఖ్యమైన స్నేహితుడు ఎవరైనా కావచ్చు. అయితే, వీలునామా సంతకం చేసిన సమయంలో సాక్షులుగా ఒక వైద్యుడు, ఒక లాయర్ ఉండడం చాలా మంచిది. సంతకం చేసే సమయంలో మానసికంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యుని సాక్షి సంతకం, న్యాయవాది సంతకం తోడవడం వల్ల వీరిద్దరు స్వతంత్ర సాక్షులుగా వ్యవహరించగలరు. ఆస్తుల విలువ కాలక్రమేణా హెచ్చుతగ్గులకు గురవుతుంది కాబట్టి వీలునామాలో ప్రస్తుత ఆస్తుల విలువను పేర్కొనవసరం లేదు. అయితే, వీలునామా రాసిన తేదీ నాటికి మీ ఆస్తుల జాబితాను రాయడం మంచిది.
వీలునామా రద్దు, మార్పు
ఇది పరిస్థితులను బట్టి సాధారణంగా జరిగేదే. వీలునామా రాసే వ్యక్తి అప్పటి పరిస్థితులను బట్టి వీలునామా రాసి ఉండవచ్చు. కానీ, కాలక్రమేణ వారి అవసరాలు, పరిస్థితులు, సంఘటనలను బట్టి, రాసిన వీలునామాకు ‘కోడిసిల్’ ద్వారా సవరణను ఎంచుకోవచ్చు. వీలునామాలోని ఆస్తికి సంబంధించిన లబ్ధిదారుని మార్చడం వంటి నిర్దిష్ట నిబంధనలన ‘కోడిసిల్’ అనుమతిస్తుంది. ఇది ఎంత త్వరగా చేయాలనేదానికి సంబంధించి కచ్చితమైన సమయం లేదు. అయితే, జీవితంలో ముఖ్యమైన సంఘటనలు సంభవించినప్పుడు లేదా ఆస్తులలో మార్పులు జరిగినప్పుడు వీలునామాను మళ్లీ నవీకరించడం మంచిది. ఎప్పుడైనా వీలునామాను ఉపసంహరించుకోవచ్చు. ‘కొడిసిల్’ ఉపయోగించి సవరించుకోవచ్చు. కొత్త తేదీతో వీలునామా సమర్పిస్తే (రిజిస్టర్ చేయక పోయినా సరే) మునుపటి వీలునామా రద్దవుతుంది. చెల్లదు.
ఎన్నారైలు
చట్టపరమైన వారసులు నాన్-రెసిడెంట్ భారతీయులు (NRIలు) అయితే, ఇండియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) 1999 ప్రకారం నిర్దిష్ట నియమాలు అమల్లోకి వస్తాయి. FEMA, ఆస్తుల బదిలీపై కొన్ని పరిమితులను విధిస్తుంది. ఇందులో నగదు మొత్తంపై పరిమితులు ఉంటాయి. కాబట్టి, వారసత్వ ఆస్తుల బదిలీ సమయంలో ఈ నియమాలను పాటించాలి.
విదేశాల్లో ఉన్నవారు వీలునామా ఏ విధంగా..
విదేశాల్లో ఆస్తులు కలిగినవారు వీలునామా రాయొచ్చు. ఎవరైనా వ్యక్తులు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో నివసిస్తున్నప్పుడు రెండు రకాల ఆస్తులను కలిగి ఉంటారు. వారు స్థానిక బ్యాంకు ఖాతాతో పాటు, వారు నివసిస్తున్న దేశంలో ఆస్తులను కలిగి ఉండొచ్చు. రెండోది వారు భారత్లో స్వీయ-ఆర్జిత ఆస్తులు లేదా వారి కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను కలిగి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో ఆ వ్యక్తులు రెండు వేర్వేరు వీలునామాలను సిద్ధం చేసుకోవడం మంచిది. ఒకటి భారత్ వెలుపల వారి గ్లోబల్ ఆస్తులకు సంబంధించినది. మరొకటి భారతీయ ఆస్తులకు ప్రత్యేకంగా. ఇలా రెండు వీలునామాలు కలిగి ఉండాలి. ఇవి ఏక కాలంలో పనిచేసే విధంగా ఉంటాయి. భారతీయ వీలునామా తప్పనిసరిగా భారతీయ చట్టాలకు లోబడి ఉండాలి.
ప్రొబేట్
ప్రొబేట్ అనేది కోర్టు ద్రువీకరించిన వీలునామా కాపీ. ఇది వీలునామాలో పేర్కొన్న విధంగా ఆస్తిని పంపిణీ చేయడానికి ఎగ్జిక్యూటర్ (వీలునామా నిర్వహించే వ్యక్తి)కు సహాయపడుతుంది. భారతీయ వారసత్వ చట్టం, హిందు వారసత్వ చట్టం ప్రకారం ముంబయి, చెన్నై, కోల్కతాలో సంతకం చేసిన వీలునామాలకు, అలాగే ఆ ప్రదేశంలో ఉన్న ఆస్తులకు ప్రొబేట్ అవసరం. ప్రొబేట్ కలిగి ఉండడం వల్ల టైటిల్స్కు సంబంధించిన కచ్చితత్వం లభిస్తుంది. అపార్ట్మెంట్లు, వ్యవసాయ భూమి వంటి ఆస్తులకు ఇది చాలా ముఖ్యమైనది. ఇది క్లీన్ టైటిల్ను అందించడంలో సహాయపడుతుంది. జీవిత భాగస్వామి, పిల్లలు వంటి చట్టబద్ధమైన వారసులకు ఫ్లాట్ యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి హౌసింగ్ సొసైటీలు కోర్టు జారీ చేసిన ప్రొబేట్ ఆర్డర్ను కోరుతుంటాయి. ఇది సొసైటీ నుంచి సొసైటీకి మారుతుంది.
వీలునామా రాయనప్పుడు..
వీలునామా లేనప్పుడు ఒకరి మతం (వ్యక్తిగత చట్టం) ఆధారంగా ఆస్తులు పంపిణీ చేస్తారు. మతాంతర వివాహం విషయంలో భారతీయ వారసత్వ చట్టం వర్తిస్తుంది. ఎగ్జిక్యూటర్ (వీలునామా నిర్వహించే వ్యక్తి)ను కోర్టు నియమిస్తుంది. ఎగ్జిక్యూటర్ అంటే వీలునామా ప్రకారం ఆస్తులను పంపిణీ చేయడానికి బాధ్యత కలిగిన వ్యక్తి.
Thanks for reading How to properly draft a will of assets?
No comments:
Post a Comment