దూసుకొస్తున్న మిచౌంగ్ భారీ వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. ఆదివారానికి తుపానుగా బలపడనుంది.
నేడు తుపానుగా బలపడనున్న తీవ్ర వాయుగుండం
5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం
కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
గంటకు గరిష్ఠంగా 100 కి.మీ. వేగంతో గాలులు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. ఆదివారానికి తుపానుగా బలపడనుంది. ఇది 5వ తేదీ మంగళవారం ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీనికి ‘మిచౌంగ్’గా పేరుపెట్టారు. తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను నేపథ్యంలో.. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు కంట్రోల్రూంలను ఏర్పాటుచేశారు.
ఆదివారం నుంచే గరిష్ఠంగా 90 కి.మీ. వేగంతో గాలులు
సోమవారం ఉదయానికి తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరానికి చేరుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. అనంతరం ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా వస్తుందని, మంగళవారం ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో ఆదివారం.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ కోరారు.
తీరప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
తుపాను హెచ్చరికల నేపథ్యంలో.. తీరగ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు. తుపాను పరిస్థితిపై శనివారం సాయంత్రం ఆయన అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ‘‘సహాయ పునరావాస కార్యక్రమాల అమలుకు కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలి. విద్యుత్తు, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే.. పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటుచేసుకోవాలి. రక్షిత తాగునీరు, ఆహారం, పాలు అందుబాటులో ఉంచాలి’’ అని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాకు రూ.2కోట్లు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధుల్ని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం
భారీవర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి
ఓ మోస్తరు వానలు: అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు
సోమవారం
భారీ నుంచి అతిభారీ వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు
ఓ మోస్తరు వానలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి
మంగళవారం
భారీ నుంచి అతిభారీ వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ
ఓ మోస్తరు వర్షాలు: కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం
బుధవారం
ఓ మోస్తరు, భారీ వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ
పలు విమానాలు, రైళ్ల రద్దు
రేణిగుంట, హైదరాబాద్, న్యూస్టుడే: తుపాను ప్రభావంతో రేణిగుంట విమానాశ్రయం నుంచి శనివారం పలు విమానాలు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యమయ్యాయి.
తుపాను నేపథ్యంలో. తొలి జాబితాలో 142 రైళ్లు, రెండో జాబితాలో మరో 10 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే శనివారం వేర్వేరుగా ప్రకటనల్లో తెలిపింది. కొన్నింటిని ఒకట్రెండు రోజులు, మరికొన్నింటిని మూడు రోజులపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పుడు తుఫాను ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా?
ఈ వెబ్సైట్ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీరు తుఫాను మార్గాన్ని తెలుసుకోవచ్చు.
వెబ్సైట్: windy.com
Thanks for reading Cyclone Michaung | Coastal Tamil Nadu braces for heavy rain as Andhra Pradesh gears up for landfall
No comments:
Post a Comment