SBI Foundation: పేద విద్యార్థులకు ఎస్బీఐ ప్లాటినమ్ జూబ్లీ ‘ఆశా స్కాలర్షిప్’
రూ.20 లక్షల వరకు చేయూత
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 15
విద్యలో విశేష ప్రతిభను ప్రదర్శించే పేద విద్యార్థులకు ఎస్బీఐ ఫౌండేషన్ (SBI Foundation) గుడ్న్యూస్ చెప్పింది. పేద విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ (Platinum Jubilee Asha Scholarship 2025)ను ప్రకటించింది. దీనిలో భాగంగా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాలకు చెందిన 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించి.. వారి చదువులకు బాసటగా నిలిచి భావి భారత నిర్మాతలను తీర్చిదిద్దనున్నట్లు ఎస్బీఐ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. పేద విద్యార్థుల చదువులకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కాలర్షిప్ కోసం రూ.90 కోట్లు ప్రకటించింది. ఎంతో గొప్ప ఆశయంతో 2022లో ప్రారంభించిన ఆశా స్కాలర్షిప్.. విద్యార్థుల కలలు, ఆకాంక్షల పట్ల అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోందని ఎస్బీఐ ఫౌండేషన్ పేర్కొంది. వెనుకబడిన విద్యార్థులకు ఉన్న విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ స్కాలర్షిప్ సమ్మిళిత వృద్ధి, దీర్ఘకాలిక దేశ నిర్మాణం అనే తమ గ్రూప్ దార్శనికతను ప్రతిబింబిస్తోందని తెలిపింది.
ఈ స్కాలర్షిప్ కార్యక్రమంపై ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడారు. ఈ ఏడాది ఎస్బీఐ ప్లాటినమ్ జూబ్లీ వేడుకలను జరుపుకొంటున్నందున అదే పేరుతో స్కాలర్షిప్ను ప్రారంభించడం తనకెంతో గర్వకారణమన్నారు. దీని ద్వారా పేదరికం నుంచి వచ్చిన 23,230 మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని, ఉన్నత చదువుల చదువుకోవాలన్న వారి ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు.
తొమ్మిదో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు వివిధ కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు వర్తిస్తుందని చెప్పారు. స్కాలర్ ఎంపిక చేసుకున్న కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.15 వేలు నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ఎస్బీఐ ఛైర్మన్ వెల్లడించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా నవంబర్ 15 వరకు అధికారిక వెబ్సైట్లో అప్లయ్ చేసుకోవచ్చని సూచించారు.
కొన్ని ముఖ్యాంశాలు..
పాఠశాల విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్స్, వైద్య విద్యార్థులు, ఐఐటీ, ఐఐఎం విద్యార్థులతో పాటు ఓవర్సీస్ విద్యార్థులూ ఈ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థి ఎంచుకున్న కోర్సు, వారి అధ్యయన స్థాయిని బట్టి ఈ స్కాలర్షిప్ రూ.15 వేలు నుంచి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఏటా రెన్యువల్ కావాలంటే విద్యార్థులు కనీస అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.
ఈ స్కాలర్షిప్కు అర్హత సాధించేందుకు విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో 75 శాతం మార్కులు లేదా 7 సీజీపీఏ సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి స్కూల్ కేటగిరీ రూ.3 లక్షలు. ఇతర కేటగిరీలకైతే రూ.6 లక్షలు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 10 శాతం సడలింపు (మార్కుల 67.5శాతం/సీజీపీఏ 6.30 సాధించాలి) కల్పించారు.
SBI Platinum Jubilee Asha Scholarship 2025
Thanks for reading SBI Platinum Jubilee Asha Scholarship 2025
No comments:
Post a Comment