About PRC Report:
- కొనసాగుతున్న తుది మెరుగులు
- నివేదిక సమర్పణకు శుక్రవారంతో ముగిసిన గడువు
- మరో రెండు నెలల గడువు పెంపు ఆశిస్తున్న కమిషన్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ(పీఆర్సీ) కోసం నియమించిన కమిషన్ తన నివేదికను దాదాపు కొలిక్కి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ నివేదికకు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆయా ఉద్యోగ సంఘాలు, ఇతరులు ఇచ్చిన వినతుల మేరకు అసలు పరిస్థితులకు మధ్య పొంతన ఉన్న అంశాలు, వ్యత్యాసాలు తదితరాలపై సమగ్ర కసరత్తు తర్వాత నివేదిక రూపుదిద్దుకున్నట్లు కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇది 11వ వేతన సవరణ కమిషన్. శుక్రవారంతో ప్రభుత్వం ఆ కమిషన్కు ఇచ్చిన గడువు ముగిసింది. ఇప్పటికే రెండు పర్యాయాలు గడువు పెంచిన ప్రభుత్వం ప్రస్తుతం మరోసారి గడువు పెంచుతుందా లేక తక్షణమే నివేదిక సమర్పించాలని సూచిస్తుందా అన్నది వేచి చూడాలి. కమిషన్ వైపు నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇందుకు సంబంధించిన వర్తమానం పంపినట్లు తెలిసింది. నివేదిక కొలిక్కి వచ్చినా కొద్దిగా మెరుగులు దిద్దాల్సి ఉందని వివరించినట్లు సమాచారం. మరో రెండు నెలల పాటు గడువు పెంచే అవకాశం ఉండొచ్చని వేతన సవరణ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. వేతన సవరణ కమిషన్ కార్యాలయం.. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని శుక్రవారం కూడా సంప్రదించినట్లు సమాచారం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేస్తుంటారు. 2018 జులై 1 నాటికి 11వ వేతన సవరణ కమిషన్ నియామకం జరగాల్సి ఉంది. అంతకన్నా ఆరునెలల ముందుగానే నాటి ప్రభుత్వం వేతన కమిషన్ నియామకం చేపట్టింది. తొలుత ఏడాది పాటు వీరికి గడువు ఇచ్చారు. కమిషన్ తన నివేదిక సమర్పించక ముందే 1.4.2019 నాడే ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇస్తూ నాటి ప్రభుత్వాధినేత ప్రకటన జారీ చేశారు. 2019 జులై ఒకటి నుంచి అది వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. మరో వైపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఆర్ను 27శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అమలు తేదీని మరికొంత ముందుకు జరిపారు. ఈ లోపు వేతన సవరణ కమిషన్ గడువు మొత్తం మీద రెండుసార్లు పెంచారు. ఆపై ఈ గడువు 2020 జనవరి 31 వరకు పెంచారు. అది శుక్రవారంతో ముగిసింది.
నాలుగు కరవు భత్యాలు పెండింగ్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం తమకు కరవు భత్యం ఎప్పుడు ప్రకటిస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు ఈ అంశంపై ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందేమోనని ఆశపడుతున్నారు. 2018 జులై, 2019 జనవరి, 2019 జులై, 2020 జనవరి నెలలకు సంబంధించి కరవు భత్యం పెండింగులో ఉంది. వరుసగా నాలుగు కరవు భత్యాలు పెండింగులో ఉండటంతో ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా? అన్న ఆసక్తితో ఆశతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
Thanks for reading
About PRC Report
No comments:
Post a Comment