AP Grama Sachivalayam Exam Date | ఏపీ గ్రామ , వార్డు సచివాలయ పరీక్షల తేదీలు వచ్చేశాయ్ .....
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై విజయవాడలోని పంచాయతీరాజ్ శాఖామంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఏపీపీఎస్సీ, పురపాలకశాఖ, వ్యవసాయ, పశుసంవర్థకశాఖ అధికారులు హాజరయ్యారు. సెప్టెంబర్ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించారు. వారం రోజుల పాటు పరీక్షల నిర్వహించనున్నారు. సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
తొలిరోజే సుమారు 4.5 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని లెక్కలు వేశారు. పరీక్షల కోసం దాదాపు 3 నుంచి 5 వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఎక్కువగా ఖాళీలు వున్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్ట్ల భర్తీపై దృష్టి సారించాలని మంత్రులు అధికారులకు సూచించారు. అలాగే, ఇటీవల ఏపీ ప్రభుత్వం, అమూల్ కంపెనీతో చేపట్టిన ఒప్పందం మీద కూడా చర్చించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల నిర్వహణ వుండాలని మంత్రులు స్పష్టం చేశారు. ఈ అంశంపై వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్లతో మంత్రులు, ఉన్నతాధికారుల వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించాలని ఈ సందర్భంగా తీర్మానించారు.
Thanks for reading AP Grama Sachivalayam Exam Date
No comments:
Post a Comment