ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు ఖరారయ్యాయి
●గరిష్టం 80 వేలు ...కనిష్ఠం 35 వేలు..
●ఇంజనీరింగ్’ కోర్సుల ఫీజులు ఖరారు
●గతేడాదికన్నా గరిష్ఠ ఫీజు 10 వేల పెంపు
●230 కళాశాలలకు రుసుముల నిర్ణయం
●ఈ ఏడాది నుంచి 2022-23 వరకు ఇవే
●113 ఫార్మసీ కాలేజీలకు కూడా నిర్ణయం
●ప్రభుత్వానికి రెగ్యులేటరీ కమిషన్ సిఫారసు
అమరావతి:ఎట్టకేలకు ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు ఖరారయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 230 కాలేజీలకు ఫీజులు నిర్ణయించారు. మరో 51 కాలేజీలకు ఖరారు చేయలేదు. గత ఏడాది వరకు రాష్ట్రంలో మొత్తం 287 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలుండగా, 6 కాలేజీలు ఫీజులు నిర్ణయించవద్దని స్వచ్ఛందంగా లేఖలు ఇచ్చాయి. ఇక మిగిలిన 281 ఇంజనీరింగ్ కాలేజీలకు గాను 51 కాలేజీల మూతకు జేఎన్టీయూకే(28), జేఎన్టీయూఏ(23)లు పాలకమండళ్లలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడంతో ఆయా కాలేజీలకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ 2020-21 విద్యా సంవత్సరానికి ఫీజును సిఫారసు చేయలేదు. మిగిలిన 230 ఇంజనీరింగ్ కాలేజీలకు 2020-23 వరకు(మూడేళ్లు) ఫీజును నిర్ణయించారు. గరిష్ఠ ఫీజు రూ.80 వేలు 8 కాలేజీలకు, కనిష్ఠ ఫీజు రూ.35 వేలు దాదాపు 90-95 కాలేజీలకు సిఫారసు చేసినట్లు తెలిసింది. అయితే, 2019-20 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి గరిష్ఠ ఫీజును రూ.10 వేలు పెంచడం గమనార్హం. మేనేజ్మెంట్ కోటా(బీ-కేటగిరి) ఫీజు విషయానికి వస్తే గతానికి భిన్నంగా.. కన్వీనర్ కోటా(ఏ-కేటగిరీ)లో నిర్ణయించిన ఫీజుకు రెండు రెట్ల వరకు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. వాస్తవానికి గత ఏడాది వరకు కన్వీనర్, మేనేజ్మెంట్ కోటాలకు ఒకే ఫీజు నిర్ణయించేవారు. ఈసారి మాత్రం మేనేజ్మెంట్ కోటా సీట్లకు రెండు రెట్ల వరకు ఫీజు తీసుకోవచ్చని నిర్ణయించడం గమనార్హం
●దీనిని ఉన్నత విద్యాశాఖ జారీ చేయనున్న ఉత్తర్వుల్లోనే పొందుపరచనున్నట్టు తెలిసింది. ఇక, బీఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఎంటెక్, ఎంఫార్మసీ, లా, ఎంబీఏ, ఎంసీఏ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు కూడా 2020-23 వరకు కమిషన్ ఫీజులు సిఫారసు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 113 బీఫార్మసీ కాలేజీలకు ఫీజులు నిర్ణయించినా.. మరో 5 కాలేజీలకు 2020-21 విద్యా సంవత్సరానికి నిర్ణయించలేదు. అంతకుముందు సీఎం జగన్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం, సీఎంవోలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆరోక్యరాజులతో రెగ్యులేటరీ కమిషన్ సెక్రెటరీ ఎన్. రాజశేఖరరెడ్డి ఫీజుల ప్రతిపాదనలపై చర్చించినట్లు సమాచారం. ఉన్నతస్థాయి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. సిఫారుసు చేసిన ఫీజుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలిసింది
●‘ఎడ్యుకేషన్’ కోర్సుల ఫీజులు కూడా
●2020-23 విద్యాసంవత్సరాలకు బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, డీపీఈడీ తదితర ఎడ్యుకేషన్ కోర్సుల ఫీజులు కూడా ఖరారయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్.. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్కు సిఫారసు చేసింది. త్వరలోనే ఈ ఫీజులపైనా ఉత్వర్వులు జారీకానున్నాయి.
Thanks for reading Fees for engineering courses have been finalized
No comments:
Post a Comment