ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.
గతంలోనే దీనిపై స్పష్టత ఇచ్చినా.. మరోసారి ప్రతిపక్షాల రాద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తరపున మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ ఏడాది హాజరు తప్పనిసరి కాదని తేల్చి చెప్పారు. కరోనా భయాల నేపథ్యంలో పిల్లల్ని స్కూళ్లకు పంపించాలా వద్దా అనే విషయంపై పూర్తిగా తల్లిదండ్రులదే నిర్ణయం అని అన్నారాయన. విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోయినా వారిని పరీక్షలకు అనుమతిస్తామని, పై తరగతులకు ప్రమోట్ చేస్తామని చెప్పారు మంత్రి అవంతి.
గతంలోనే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
అయితే రాష్ట్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొవిడ్ కేసులు నమోదవుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలని, విద్యార్థులకు స్మార్ట్ ఫోన్, ట్యాప్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హాజరు విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. హాజరు విషయంలో ఎక్కడా ఉపాధ్యాయులు.. విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి చేయకూడదని కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అదే సమయంలో అలాంటి వారికి ఆన్ లైన్ తరగతులపై అవగాహన కల్పించాలని కూడా చెప్పింది.
ఏపీలో స్కూళ్లు తెరిచే ముందు కొవిడ్ పరీక్షలు చేసిన సమయంలో 829మంది ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులకు కొవిడ్ నిర్థారణ అయింది. అయితే వీరిలో ఎవరికీ స్కూల్ కి రావడం వల్ల కరోనా సోకినట్టు తేలలేదు. కొత్తగా విద్యార్థులెవరూ కరోనాబారిన పడిన దాఖలాలు లేవు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నాయి. స్కూళ్లను తెరిచిన ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నిస్తున్నారు నేతలు. దీంతో ప్రభుత్వం మరోసారి స్కూళ్ల విషయంపై దృష్టిపెట్టింది. విద్యాసంవత్సరం వృథా కాకుండా ఉండాలంటే స్కూళ్లను యధావిధిగా నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే హాజరు మినహాయించి తల్లిదండ్రుల అనుమతితో హాజరయ్యా విద్యార్థులకు పాఠాలు చెప్పేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
Thanks for reading Good news for AP government students.
No comments:
Post a Comment