ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలు
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంఘాల ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలు అందజేసే పథకాన్ని రూపొందించినట్లు ఇంధనశాఖ తెలిపింది. ఆసక్తి చూపే ఉద్యోగులకు ఈఎంఐ విధానంలో వీటిని అందజేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర అల్పాదాయ ఉద్యోగులకు ఈ పథకం ఐచ్ఛికమేనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలో జీవో వెలువడనున్నట్లు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ద్విచక్ర వాహనాలను ఒకసారి ఛార్జింగ్ చేస్తే 40 నుంచి 100 కి.మీ వరకు వెళ్తాయని, ఉద్యోగులు తమకు నచ్చిన మోడళ్లు, బ్రాండ్లు ఎంపిక చేసుకునే వీలుంటుందని తెలిపారు. 24 నుంచి 60 నెలల్లో ఈఎంఐ చెల్లించే అవకాశం ఉంటుందన్నారు.
మరో 400 చోట్ల ఛార్జింగ్ స్టేషన్లు
విద్యుత్ వాహనాల(ఈవీ) పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 500 నుంచి వెయ్యి ఎకరాలు కేటాయిస్తుందని శ్రీకాంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఈఈఎస్ఎల్ 80 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, మరో 73 చోట్ల 400 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం వీటికి సబ్ కేటగిరీ ఏర్పాటు చేసి, యూనిట్కు రూ.6.70గా టారిఫ్ ఖరారు చేసినట్లు వివరించారు. ఎలాంటి డిమాండ్ ఛార్జీలు లేకుండా ఈ ధరను నిర్ధారించినట్లు చెప్పారు.
Thanks for reading Electric bikes for government employees
No comments:
Post a Comment