Andhra Pradesh : ఏపీలో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త .. బిల్లు తగ్గించుకునే ఆఫర్ ఇస్తోన్న APEPDCL
ఏపీలో విద్యుత్ వినియోగదారుల కష్టాలు తగ్గించే దిశగా APEPDCL అడుగులు వేస్తోంది. రోజు రోజుకూ విద్యుత్ వాడకం పెరగడంతో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సహజవనరులతో తయారయ్యే విద్యుత్ ను వాడుకొనేలా ప్రాజెక్టులు తీసుకురావాలని కేంద్రం ఇప్పటికే సూచించింది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా సహజ ఇంధన వనరుల్ని ఉపయోగించుకుని విద్యుత్ వినియోగం పెంచుకోవాలని పదే పదే సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీఈపీడీసీఎల్ సోలార్ ఆఫర్ ఇస్తోంది. దీంతో ఐదు జిల్లాలో సోలార్ విద్యుత్ కోసం గృహ వినియోగదారులు అప్లై చేసుకోవచ్చని విద్యుత్ అధికారులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గృహ విద్యుత్ వినియోగదారులకోసం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో సబ్సిడీపై గ్రిడ్ కనెక్టడ్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏపీఈపిడిసిఎల్ అందిస్తున్నట్లు సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ వి.విజయలలిత ప్రకటించారు.
కేంద్ర సంప్రదాయ ఇంధన వనరుల పునరుత్పాదక మంత్రిత్వ శాఖ ఆర్టిఎస్-II ప్రోగ్రాం కింద గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్టాప్ కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించింది.8 మెగావాట్ల సామర్ధ్యంతో ఏపీఈపిడిసిఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల గృహ విద్యుత్ వినియోగదారులకు ఈ అవకాశం కల్పిస్తోంది. వారంతా తమ ఇళ్లపై గ్రిడ్ కనెక్టడ్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొనే కార్యక్రమాన్ని 15 నెలల కాలపరిమితితో పూర్తి చేయడానికి మంజూరు చేసారని పేర్కొన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులు సోలార్ రూఫ్టాప్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికిగాను 1 కిలోవాట్ నుండి 10 కిలోవాట్ల కేటగిరిల కొరకు 16 ఏజెన్సీలను, 10 కిలోవాట్ల నుండి 500 కిలోవాట్ల కేటగిరిల కొరకు 3 ఏజెన్సీలను ఎంపానెల్ చేశామన్నారు.
ఏపీఈపిడిసిఎల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అభివృద్ధి చేసిన అప్లికేషన్ ను ఆన్లైన్ వెబ్ పోర్టల్లో https://onlineapp.apeasternpower.com/ లో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుచేసుకొనే గృహ విద్యుత్ వినియోగదారులకోసం అందుబాటులో ఉంచామని సీజిఎం తెలిపారు. గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు కోసం టెండర్ ప్రక్రియలో వచ్చిన రేట్ల ప్రకారం 1 కిలోవాట్ కి సోలార్ రూఫ్టాప్ సామర్థ్యం ధర కిలోవాట్ కి రూ.50,000/- , 1 కిలోవాట్ పైబడి 2 కిలోవాట్ల వరకు కిలోవాట్ కి 47,000/-, 2 కిలోవాట్ల పైబడి 3 కిలోవాట్ల వరకు కిలోవాట్ కి రూ.45,000/-, 3 కిలోవాట్ల పైబడి 10 కిలోవాట్ల వరకు కిలోవాట్ కి రూ. 44,000/-, 10 కిలోవాట్ల పైబడి 100 కిలోవాట్ల వరకు కిలోవాట్ కి రూ. 38,000/-, 100 కిలోవాట్ల పైబడి 500 కిలోవాట్ల వరకు కిలోవాట్ కి రూ. 36,000/- గా ఖరారు చేశారు. వీటికి అదనంగా దరఖాస్తు రుసుము (జిఎస్టి అదనం), మీటరింగ్ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది.ఆ రేట్లతోనే..? ఈ రేట్లలో సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ల రూపకల్పన, సరఫరా, సంస్థాపన, భీమాతో సహా 5 సంవత్సరాల వారంటీ / వార్షిక నిర్వహణ ఒప్పందం కలిగి ఉన్నాయన్నారు. వీటికి అదనంగా దరఖాస్తు రుసుము, మీటరింగ్ ఖర్చు ఏపీఈపిడిసిఎల్ కు చెల్లించవలసి ఉంటుంది. ఎంపానెల్డ్ ఏజన్సీల ద్వారా మాత్రమే గృహ విద్యుత్ వినియోగదారులు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఇన్స్టాల్ చేసుకోవాలని, ఎంయన్ఆర్ఇ మార్గదర్శకాల ప్రకారం బెంచ్ మార్క్ ధరలపై 3 కిలోవాట్ల వరకు సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలలో 40% సిఎఫ్ఏ (సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్), 3 కిలోవాట్ల పైబడి 10 కిలోవాట్ల కంటే ఎక్కువ సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలపై 20% సిఎఫ్ఏ అందుబాటులో ఉంటుందన్నారు.రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేషన్స్ / అపార్ట్మెంట్స్ కు 20 శాతం మాత్రమే సిఎఫ్ఏ అందుబాటులో ఉంటుందని వినియోగదారులు సిఎఫ్ఏ అమౌంట్ ను తగ్గించి ఏజెన్సీకి చెల్లించవలసి ఉంటుందని, విద్యుత్ పంపిణి సంస్థ ద్వారా ఎంయన్ఆర్ఇ వారు సిఎఫ్ఏ అమౌంట్ ను ఏజెన్సీకి విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. గృహేతర విద్యుత్ వినియోగదారులు తనకు నచ్చిన ఇతర ఏజెన్సీల ద్వారా అయినా దరఖాస్తు చేసుకోవచ్చని వారికి సిఎఫ్ఎ వర్తించదని ఏపీఈపిడిసిఎల్ సిజిఎం వి.విజయలలిత తెలిపారు.పూర్తి వివరాలను ఈ వెబ్ సైట్ https://www.apeasternpower.com/solarDetials ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఏపీఈపిడిసిఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు.
Thanks for reading Andhra Pradesh: Good news for power consumers in AP .. APEPDCL is offering a bill reduction
No comments:
Post a Comment