Indian Railways: ఖాళీ సీటు గుర్తింపు ఇక సులువు!.. రైౖళ్లలో హెచ్హెచ్టీ పరికరాలు
ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం
సేవల్ని విస్తృతం చేసిన దక్షిణ రైల్వే
చెన్నై నుంచి మదురై వెళ్లాలనుకున్న ఓ ప్రయాణికుడికి బెర్త్ రిజర్వేషన్ దొరకలేదు. అత్యవసరంగా వెళ్లాలనుకున్న ఈ ప్రయాణం రద్దవుతుందని భావించారు. కానీ ఆన్లైన్ కరెంట్ రిజర్వేషన్ ఆప్షన్తో చెన్నై నుంచి సేలం వరకు ఓ బెర్తు, అక్కడి నుంచి మదురైకి మరో బెర్త్ సాధించుకోగలిగాడు. అతనికి పెద్ద ఊరట లభించింది. భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన హ్యాండ్ హోల్డ్ టెర్మినల్ (హెచ్హెచ్టీ) పరికరాల్లో ఎప్పటికప్పుడు బెర్త్ల తాజా ఖాళీ స్థితిని ఆన్లైన్లో పొందుపరిచడం వల్లే ఇది సాధ్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.
రైళ్లలో టికెట్ తనిఖీ కోసం కరెంట్ రిజర్వేషన్ టికెట్లు మరింత మందికి అందుబాటులోకి వచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా హెచ్హెచ్టీ పరికరాల్ని విడతలవారీగా రైళ్లలో అందుబాటులోకి తెస్తున్నారు. ప్రత్యేకించి దక్షిణ రైల్వేలో ఈ పరికరాల్ని భారీగా తెచ్చారు. ప్రయోగాత్మకంగా 2018 డిసెంబరులోనే ఈ డివైజ్లను వాడారు. అప్పట్లో చెన్నై-మైసూరు, చెన్నై-కోయంబత్తూరు శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో ఈ పరికరాల పని తీరును పరిశీలించారు. మంచి ఫలితాలు రావడంతో.. తాజాగా రెండో విడతలో పెద్దఎత్తున ప్రవేశపెట్టారు. ఏకంగా 857 హెచ్హెచ్టీలను టీటీసీలకు అందుబాటులోకి తెచ్చారు. వీటిని తమిళనాడు నుంచి వివిధ రూట్లలో తిరిగే 185 రైళ్లలో అందుబాటులో ఉంచారు. దీంతో దక్షిణ రైల్వేలో మొత్తంగా 187 రైళ్లలో హెచ్హెచ్టీ పరికరాలతో ప్రయాణికులకు అనువైన సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లయింది. మిగిలిన రైళ్లలోనూ విడతలవారీగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
సాంకేతికత ఇలా..
* రైల్వే ప్రయాణ చార్ట్ పూర్తవగానే.. ఆ డిజిటల్ జాబితా హెచ్హెచ్టీ పరికరాల్లో అప్లోడ్ అవుతుంది. రైళ్లలో ప్రయాణికుల టికెట్ల పరిశీలన కూడా ఈ డివైజ్ ద్వారానే చేస్తున్నారు.
* ఈ సౌకర్యంతో ఏ బెర్త్ల్లో ప్రయాణికులు వచ్చారనే వివరాలు వెంటనే ఆన్లైన్లో అప్డేట్ చేయొచ్చు. ఈ సమాచారం దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే సర్వర్కు వెళ్తుంది.
* ఈ తరహా డాటా ద్వారా రైలు బయలుదేరే సమయంలో కరెంట్ రిజర్వేషన్ బెర్తులు ఎక్కడినుంచి ఎక్కడివరకు ఖాళీగా ఉన్నాయనేది రియల్టైమ్లో తెలుసుకునే అవకాశం వచ్చింది.
* ఆన్లైన్ ద్వారా వీటిని బుక్ చేసుకునే వీలు కలుగుతోంది. ఓ పక్క సీట్లు భర్తీ అవుతున్నకొద్దీ ఆ వివరాలు కూడా టీటీసీ దగ్గరున్న డివైజ్ల్లో గంటకోసారి అప్డేట్ అవుతున్నాయి.
టికెట్ రద్దవగానే ఖాళీ
హెచ్హెచ్టీ సర్వర్ను పీఆర్ఎస్కి అనుసంధానించారు. దీంతో ఎవరైనా చార్ట్ తయారయ్యాక టికెట్ను రద్దు చేసుకున్నా.. ఆ సీటు ఖాళీల వివరాలు రిజర్వేషన్ కౌంటర్ నుంచి నేరుగా సర్వర్కు వెళ్తున్నాయి. పైగా టీటీసీ దగ్గరున్న హెచ్హెచ్టీలోనూ అప్డేట్ అవుతున్నాయి. ఈ సీట్లను మరొకరికి కేటాయించేందుకు హెచ్హెచ్టీ ఆన్లైన్ వేదిక సులవవుతోంది. ఒకవేళ వెయిటింగ్ లిస్టువారికి బెర్తు ఇవ్వాలన్నా.. ఈ డివైజ్లో ప్రయాణికుల వివరాలు అప్లోడ్ చేసి కేటాయిస్తున్నారు. ఇలా సీట్ల కేటాయింపు పూర్తిస్థాయిలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తెచ్చినట్లుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. మార్గమధ్యలో నెట్వర్క్ లేకపోయినా ఆఫ్లైన్లో చార్టులు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటునూ ఈ డివైజ్లకు ఇచ్చారు.
అక్రమాలకు తావులేకుండా..
తాజాగా మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు, సేలం వైపు వెళ్లే మరిన్ని రైళ్లలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. సీట్ల కేటాయింపు ఆన్లైన్లో జరుగుతుండటంతో కొందరు టీటీసీలు చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేసే పరిస్థితి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రైల్వే ఎన్ని విధానాలు తెచ్చినా కొందరు టీటీసీ అక్రమాలు కొనసాగే మార్గాలు కనిపిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొత్త విధానాన్ని పకడ్బందీగా అమలయ్యేలా చేయాలని కోరుతున్నారు. ఈ పరికరాల్ని వినియోగించడం ద్వారా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ అవడం శుభపరిణామమని, తాము వివిధ యాప్ల ద్వారా కరెంట్ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతోందని ప్రయాణికులు పి.కృష్ణకుమార్ తెలిపారు. హెచ్హెచ్టీ ద్వారా టికెట్ ముందుగా తీసుకున్నవారికి ప్రాధాన్యతాపరంగా సీట్ల కేటాయింపులు ఉండాలని మరో ప్రయాణికుడు అస్లంబేగ్ అన్నారు.
Thanks for reading Indian Railways: Identification of empty seats is now easy!.. HHT devices in trains
No comments:
Post a Comment