టీచర్ నంబర్-1
బతకలేక బడిపంతులు అని ఎందుకన్నారో కానీ నిజానికి విద్యార్థులకు బతుకుదారి చూపించగల శక్తి వారికే ఉంటుంది. వాళ్లు పాఠాలు చెప్పడాన్ని తమ ఉద్యోగంగా కాక పిల్లల అవసరంగా భావిస్తారు. ఆ అవసరం తీర్చడానికి తరగతి గది దాటి తాము పనిచేసే పరిధిని విస్తరించుకుంటారు. విద్యార్థుల చేయిపట్టుకుని సమాజంలోకి నడిపిస్తారు. వారి విజయం కోసం తపిస్తారు. వేలాది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన వీరంతా అలాంటి టీచర్లే. ఉపాధ్యాయవృత్తికి నోబెల్ ప్రైజ్లా భావించే ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అందుకున్న ఈ విజేతలు ప్రపంచ వేదిక దాకా రావడానికి మారుమూల పల్లెల్లో వారు చేసిన అసాధారణ ప్రయాణమే కారణం.
‘పెద్దయ్యాక ఏమవుతావు’... చిన్నప్పుడు ఈ ప్రశ్న ఎదుర్కొనని పెద్దలూ, పెద్దయ్యాక తమ పిల్లల్ని అడగని తల్లిదండ్రులూ ఉండరేమో. ఇళ్లలోనే కాదు, బడిలో టీచర్లూ ఏదో ఒక సందర్భంలో విద్యార్థుల్ని అడిగేవుంటారు. కానీ ‘మీలాంటి టీచర్నవుతాను’ అన్న సమాధానం మాత్రం వారికి ఎప్పుడూ వచ్చి ఉండదు.
డాక్టర్, లాయర్, ఇంజినీర్, పైలట్... అంటూ చెప్పే కలల కెరీర్లలో టీచరు ఉద్యోగం ఎప్పుడూ ఉండదు. పొరపాటున ఎవరైనా చెప్పినా తల్లిదండ్రులు ఉలిక్కిపడతారు. కాదమ్మా నువ్వు డాక్టరు అవ్వాలి... అంటూ సరిదిద్దుతారు. నిజానికి ఏ వృత్తి ప్రాధాన్యం దానిదే. వాటిన్నిటికంటే కొంచెం ఎక్కువ ప్రాధాన్యం ఉపాధ్యాయ వృత్తిది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పిల్లల వ్యక్తిత్వం రూపు దిద్దుకొనడంలో టీచర్ల పాత్ర ఎంతో కొంత ఉండి తీరుతుంది. అంతటి కీలకమైన ఉద్యోగాన్ని అతి తక్కువ మంది మాత్రమే గొప్ప హోదాగా పరిగణిస్తున్నారు... అంటోంది ఒక అధ్యయనం.
అంతేకాదు, ప్రపంచదేశాలన్నిట్లో కలిపి దాదాపు ఎనిమిదిన్నర కోట్లమంది టీచర్లు ఉన్నప్పటికీ ఇంకా ఏడుకోట్ల మంది టీచర్ల అవసరం ఉందట. శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈరోజుల్లో కూడా అసలు బడి ముఖమే చూడనివారు 26 కోట్లమంది ఉన్నారట. ఇలాంటి లెక్కలన్నీ కూడా వార్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకుల్ని ఆలోచింపజేశాయి. మంచి ఉపాధ్యాయుడిని పొందడం పిల్లల హక్కు అని భావించిన ఈ సంస్థ అలాంటి ఉపాధ్యాయులను ప్రోత్సహించడానికి చాలా పెద్ద బాధ్యతనే తలకెత్తుకుంది. గ్లోబల్ టీచర్ ప్రైజ్ పేరుతో ఏటా ఒక అవార్డుని ఏడు కోట్ల రూపాయల నగదు బహుమతితో కలిపి అందిస్తోంది. యునెస్కో సహకారంతో 2015లో ప్రారంభించిన ఈ బహుమతిని ఇప్పటికి ఏడుగురు గెలుచుకున్నారు. దేశదేశాలనుంచి వచ్చిన వేలాది దరఖాస్తులను వడపోసి ఒక్కరిని ఎంపిక చేయడమంటే కత్తిమీద సామే. ఆ పోటీలో గెలిచి అవార్డుని అందుకున్న విజేతల కథలివి..!
ప్రపంచ బ్యాంకు సలహాదారుగా...
రంజిత్ సింహ్ దిశాలె... ఇంజినీరింగ్ చదవాలని కలలు కన్నాడు. తండ్రి ఫీజు కట్టలేననడంతో టీచర్ ట్రైనింగ్లో చేరాడు. తనలాంటి పేద కుటుంబాల పిల్లల జీవితాల్ని మార్చేది చదువేనని ఆ శిక్షణలో ఉండగా అర్థమైంది. మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దులో ఉన్న పరిటెవాడి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగం వచ్చింది. ఆ పల్లెను వెతుక్కుంటూ వెళ్లిన రంజిత్కి పశువుల పాకను ఆనుకుని సగం కూలిపోయిన గుడిసెను చూపించి అదే పాఠశాల అని చెప్పారు. అక్కడి జనాభా అంతా గిరిజనులు. వాళ్లు మాట్లాడేది కన్నడం. బడిలో చెప్పేది మరాఠీ మీడియం. దాంతో పిల్లలసలు బడి మొహమే చూసేవారు కాదు. పది పన్నెండేళ్లు రాగానే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు, మగపిల్లల్ని కూలీకి పంపేవారు. పరిస్థితిని అర్థం చేసుకున్న రంజిత్ ఆ గ్రామానికి మకాం మార్చాడు. వాళ్ల మధ్యే ఉంటూ భాష నేర్చుకున్నాడు. పాఠ్య పుస్తకాలన్నిటినీ వాళ్ల భాషలోకి అనువదించి డిజిటలైజ్ చేసి క్యూఆర్ కోడ్ ఏర్పాటుచేశాడు. పిల్లలు బడికి వచ్చేదాకా వేచి చూడకుండా తానే వాళ్ల దగ్గరకు వెళ్లి ఫోను సాయంతో మాతృభాషలోనే పాఠాలు చెప్పేవాడు. వీడియోలు చూపించి బడికొస్తే ఇలాంటివెన్నో నేర్పుతానని చెప్పేవాడు. అతడి కృషి ఫలించి కొంతకాలానికే నూరుశాతం హాజరు నమోదైంది. పిల్లల్లో సైన్సు పట్ల ఆసక్తి పెంచడానికి తన ఇంట్లోనే ఒక గదిని లేబొరేటరీగా మార్చి రకరకాల ప్రయోగాలు చేసి చూపించేవాడు. అతని ఆధ్వర్యంలో 85 శాతం పిల్లలు ఏ గ్రేడ్లో పాసవడంతో జిల్లాలో ఉత్తమ పాఠశాలగా పేరు తెచ్చుకుంది. బాల్యవివాహాలు ఆగిపోయాయి. మొట్టమొదటిసారి ఆ ఊరి నుంచి అమ్మాయిలు యూనివర్సిటీలో చేరారు. రంజిత్ ప్రారంభించిన ‘పాఠ్యపుస్తకాలకు క్యూఆర్ కోడ్’ అనే విధానం విద్యాశాఖ నిపుణుల్ని ఆలోచింపజేసింది. ఫలితంగా ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల పాఠ్య పుస్తకాలే కాదు, ఎన్సీఈఆర్టీ సైతం క్యూఆర్కోడ్ విధానాన్ని అందిపుచ్చుకుంది. దానివల్ల పాఠ్యాంశానికి సంబంధించి పుస్తకాల్లో లేని అదనపు సమాచారాన్ని పిల్లలు ఆన్లైన్లో చదువుకోవడం సులువవుతుంది.
గ్రామస్తులకు నీటి సంరక్షణ చర్యలు నేర్పించి వలసల్ని ఆపాడు రంజిత్. వేసవిలోనూ పిల్లల్ని ఖాళీగా ఉంచకుండా విదేశాల్లోని పాఠశాలలను సంప్రదించి అక్కడి విద్యార్థులతో ఆన్లైన్లో స్నేహ సంభాషణలు జరిపేలా చూసేవాడు. ఇది పిల్లల అవగాహననూ ఆలోచననూ విస్తృతం చేసేది. మరోపక్క తానూ మైక్రోసాఫ్ట్ సహాయంతో 83 దేశాలకు చెందిన టీచర్లకు శిక్షణ ఇచ్చాడు.
సత్య నాదెళ్ల తన పుస్తకం ‘హిట్ రిఫ్రెష్’లో రంజిత్ గురించి పేర్కొన్నారు. అవార్డు కింద తాను అందుకున్న బహుమతి మొత్తంలో సగాన్ని టాప్టెన్ ఫైనలిస్టులకు పంచాడు రంజిత్. వివిధదేశాల్లో బోధనలో నాణ్యత పెంచేందుకుగాను ప్రారంభించిన ‘గ్లోబల్ కోచ్’ కార్యక్రమం కోసం విద్యారంగంలో సలహాదారుగా అతడిని నియమించుకుంది ప్రపంచబ్యాంకు.
రచయితలను తీర్చిదిద్దిన చదువరి
చిన్నవయసులోనే రుమాటిక్ ఫీవర్ రావడంతో పుస్తకాలు చదువుతూ ఆ బాధను మర్చిపోయేది నాన్సీ అట్వెల్. ఆ అలవాటే ఆమెను భాషలోనూ రచనా రీతుల్లోనూ మంచి పట్టు సాధించేలా చేసింది. ఇంగ్లిషులో బిఏ పూర్తిచేసి టీచరుగా చేరింది. అటు స్కూల్లో పాఠాలు చెబుతూనే అదనంగా పిల్లల్లో ఆసక్తి పెంచడానికి వారాంతాల్లో ఇంగ్లిషు చదవడం, రాయడంపై వర్కుషాపులు నిర్వహించేది. విద్యార్థుల్లో ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి విడిగా పాఠాలు చెప్పేది. కథలు సూపర్ హీరోల్లాంటివి, వాటిని ఎంత బాగా వాడుకుంటే టీచరు అంతగా రాణించవచ్చు... అనే నాన్సీ, కథల్లాగే పాఠాలూ చెబుతుంటే వినడానికి విద్యార్థులు క్యూ కట్టేవారు. ఆమె క్లాసులో పిల్లలు తప్పనిసరిగా ఏడాదికి 14 విభాగాలకు చెందిన 40 పుస్తకాలు చదవాలి. చదివిన పుస్తకాల విశేషాల గురించి చర్చించాలి. అలాగే రాయడంలో ఆసక్తి ఉన్నవారు- వ్యాసం, కథ, కవిత... ఇలా 13 విభాగాల్లో కనీసం 20 అంశాలు రాయాలి. నాన్సీ దగ్గర శిష్యరికం చేసినవారు ఎందరో ఇప్పుడు రచయితలుగా పేరొందారు. ఇదంతా చూసిన ఇతర టీచర్లు కూడా పాఠాలు చెప్పడంలో నాన్సీ దగ్గర శిక్షణ పొందేవారు. పాతికేళ్లపాటు టీచరుగా పనిచేశాక నాన్సీ పేద విద్యార్థుల కోసం లాభాపేక్ష లేని సంస్థ ‘సెంటర్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్’ని మెయినీ రాష్ట్రంలో ప్రారంభించింది. అది భిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివసించే వెనకబడిన ప్రాంతం కావడంతో అక్కడి పిల్లలకు ఆ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతోంది. సామాజిక అంతరాలను అధిగమించి అందులో చదువుకున్న 97శాతం పిల్లలు యూనివర్సిటీ విద్యకు వెళ్లడం విశేషం. ఆమె తన బహుమతి మొత్తాన్నీ ఈ స్కూలుకే ఇచ్చేశారు. వివిధ రకాల బోధనా పద్ధతులను పరీక్షించే ప్రయోగశాలగా కూడా ఈ పాఠశాల టీచర్లకూ ఉపయోగపడుతోంది. ఆంగ్లబోధన గురించి నాన్సీ రాసిన 9 పుస్తకాలూ హార్వర్డ్ విద్యావేత్తల ప్రశంసలు అందుకున్నాయి.
యుద్ధభూమిలో శాంతి పాఠం
ఎప్పుడూ యుద్ధ మేఘాలు ముసురుకున్నట్లుండే పాలస్తీనాలో శరణార్థుల శిబిరంలో పెరిగింది హనన్ అల్ హరుబ్. ఇంగ్లీష్ చదువుకున్న ఆమెకి¨ అనువాదకురాలిగా పనిచేయాలని కోరిక. ఓరోజు పిల్లల కళ్ల ముందే ఆమె భర్తమీద ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. దాంతో పిల్లలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. వాళ్లను మామూలు మనుషులను చేయడానికి ఎంతగానో ప్రయత్నించింది హనన్. ఆమె ఆ ప్రయత్నాల్లో ఉండగానే మరో కాల్పుల ఘటనలో ముగ్గురు పిల్లలు బలైపోయారు. హనన్ కుప్పకూలిపోయింది. మిగిలిన ఇద్దరు పిల్లలకోసం ధైర్యం కూడదీసుకుని టీచరు ఉద్యోగంలో చేరింది. ఆ దుఃఖ పూరితమైన వాతావరణానికి తోడు వీధుల్లో నిత్యం కన్పించే సంఘటనలు పిల్లల్ని కూడా హింసాత్మకంగా మార్చేవి. పాఠశాలలో తరచూ దాడులకు పాల్పడేవారు. ఈ పరిస్థితుల్ని మార్చాలనుకుంది హనన్. తన పిల్లలకి ఎలా ప్రేమతో బుజ్జగిస్తూ చెప్పేదో అలాగే స్కూల్లో పిల్లలకీ చెప్పేది. మంచి మాటలతో, ఆటలతో పిల్లల్ని మంచి పౌరులుగా తయారుచేయడానికి పూనుకుంది. పరస్పరప్రేమ, శాంతియుత సహజీవనం గురించి వారికి బోధించేది. స్కూల్లో విపరీతంగా ఆటలు ఆడించేది. రకరకాల నియమాల మధ్య ఆడే ఆటలవల్ల పిల్లలకు సామాజిక నియమాలకు కట్టుబడడం అలవడుతుందనీ, శారీరకంగా అలసిపోవడం వల్ల దుడుకు స్వభావమూ తగ్గుతుందనీ అనుభవపూర్వకంగా తెలుసుకుంది. ఆమె ఆలోచన నూటికి నూరుపాళ్లూ విజయం సాధించింది. పిల్లలతో ఎలా నడచుకోవాలనే విషయంలో హనన్ చేత ఉపన్యాసాలూ సెమినార్లూ ఇప్పించారు అధికారులు. అన్ని పాఠశాలలూ అదే పద్ధతిని అవలంబించడంతో ఆ ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు బాగా తగ్గాయి.
ఆకలి తీర్చి, పాఠం చెప్పి..
ఇంగ్లండ్కి చెందిన ఆండ్రియా జఫిరకా బ్రెంట్లోని అల్పర్టన్ కమ్యూనిటీ స్కూల్లో టీచరుగా పనిచేస్తోంది. టీచరు పని పాఠాలు చెప్పడమే కానీ, ఆండ్రియా మాత్రం అక్కడ చాలా పనులు చేసేది. పిల్లలకు అల్పాహారం వండి పెట్టేది. దుస్తులు ఉతికేది. ఆకలితో, మురికి బట్టలతో పిల్లలు చదువుకోలేరు కదా- అని అన్నీ ప్రేమగా చేసేది ఆండ్రియా. ప్రపంచంలోని భిన్న సంస్కృతులకు చెందిన వలసదారులూ అత్యంత నిరుపేద వర్గాలూ ఉండే చోటు అది. ఎంతటి పేదరికం అంటే- ఒక్కో గదిలో ఒక్కో కుటుంబం చొప్పున ఒకే ఇంట్లో ఐదారు కుటుంబాలుంటాయి. వంటగదినీ బాత్రూమ్నీ వంతులవారీగా వాడుకుంటారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లిపోతే పిల్లలే తమ వంతు సమయం వచ్చినప్పుడు ఇంటికెళ్లి వంటచేసి వచ్చేవారట. పేదరికమూ ఆకలీ ఇంటా బయటా హింసా...నిత్యం కన్పించే దృశ్యాలు. 35 భాషలు మాట్లాడే విద్యార్థులు ఉన్నందున ఆ భాషలన్నిటిలోనూ ముఖ్యమైన పదాలను నేర్చుకుంది ఆండ్రియా. తమకు తెలిసిన వాళ్లెవరూ లేని చోటికి భయం భయంగా వస్తున్న పిల్లల్ని వారి భాషలో పలకరించి ఆప్యాయంగా అక్కున చేర్చుకునేది. అమ్మలా ఆదరిస్తున్న ఆమెను వాళ్లూ ప్రేమించడం మొదలెట్టారు. స్కూలు అయిపోయిన తర్వాత పిల్లలు దురలవాట్లవైపు వెళ్లకుండా చూడడానికి స్పోర్ట్స్ క్లబ్బులు పెట్టింది. ఇంటిపనులతో సతమతమయ్యే పిల్లలకోసం వారాంతంలో క్లాసులు తీసుకునేది. తరచూ ఇళ్లకు వెళ్లి పెద్దలతో మాట కలిపేది. పిల్లలందరికీ నేర్చుకునే సామర్థ్యం ఒకేలా ఉండదనీ, వాళ్ల నేపథ్యాన్ని బట్టి పాఠాలు చెప్పాలనీ భావించే ఆండ్రియా బహుళ జాతుల వారుండే పాఠశాలలో అందరికీ ఒకే పద్ధతి పాటించాలన్న నియమం పనికిరాదంటుంది. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకుని, వారి నమ్మకాన్ని చూరగొని ఆ తర్వాత పాఠాలు చెబుతూ క్రమంగా మంచి ఫలితాలు సాధించడంలో ఆండ్రియా కృతకృత్యురాలయింది. ఇప్పుడు ఆ పాఠశాల దేశంలోని టాప్ స్కూల్స్లో ఒకటైంది.
ఊరినే మార్చేసింది!
మ్యాగీ మెక్డొనెల్ది కెనడా. చరిత్ర అంటే ఇష్టపడే ఆమెని దేశంలో ఆదివాసీల పట్ల జరిగిన అన్యాయాలూ, ఆర్థిక, సామాజిక అసమానతలూ ఆలోచింపజేశాయి. దాంతో అలాంటివారు ఉన్నచోట టీచరుగా పనిచేయాలనుకుని ప్రయత్నిస్తే కెనెడియన్ ఆర్కిటిక్ ప్రాంతం అయిన సల్యూట్ అనే గ్రామంలో ఉద్యోగం వచ్చింది. ఆ ఊరు వెళ్లడానికి విమానం తప్ప మరో మార్గమే లేదు. చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 25 డిగ్రీలకు పడిపోతాయి. అక్కడికి ఎవరిని పంపించినా రెండోరోజే వాతావరణం సాకు చూపి సిక్ లీవ్ పెట్టుకుని తిరిగి వస్తారు, మళ్లీ వెళ్లరు. దాంతో చదువూ సంధ్యా లేక బయటప్రపంచంతో సంబంధం లేక, కుంగుబాటుకు లోనవుతున్న అక్కడి యువతలో ఆత్మహత్యలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. లైంగిక హింస, టీనేజీ గర్భాలు, తాగుడు, ... అసలక్కడ లేని సామాజిక సమస్య లేదు. అలాంటి చోటికి కోరి మరీ టీచరుగా వెళ్లిన మ్యాగీ తరగతి గదిలో కూర్చుని పిల్లలు వస్తే పాఠాలు చెప్పాలనుకోలేదు. వాళ్ల పరిస్థితులను బాగా గమనించింది. యువతని మామూలు మనుషుల్లో పడేయడానికి రకరకాల కార్యక్రమాలను రూపొందించింది. ఒక టీచరులా కాక, సంఘ సంస్కర్తలా మారింది. జీవన నైపుణ్యాల్లో బాలబాలికలకు విడివిడిగా శిక్షణ ఇచ్చేది. దాంతో పిల్లలందరూ ఆమెలో ఒక స్నేహితురాల్ని చూసుకున్నారు. ప్రభుత్వం చేత నిధులు మంజూరు చేయించుకుని పోషకాహారం తయారుచేసి చిన్న పిల్లలకు ఇచ్చే బాధ్యతను పెద్ద పిల్లలకు అప్పజెప్పింది. పిల్లలు అటు చదువుకుంటూనే ఇటు సామాజిక బాధ్యతల్లో పాల్గొనేలా చూసేది. శారీరక దృఢత్వం కోసం ఫిట్నెస్ సెంటర్లు పెట్టించింది. ఒక్కో సమస్యమీదా చర్చ లేవనెత్తుతూ దాని పర్యవసానాల గురించి అర్థమయ్యేలా వివరించి చెప్పేది. నిరాసక్తంగా నిస్తేజంగా సాగుతున్న వారి జీవితాల్లో మ్యాగీ హుషారు తెచ్చింది. పిల్లల్ని తరచూ విహారయాత్రలకు తీసుకెళ్లేది. క్రౌడ్ ఫండింగ్ సాయం తీసుకుని గ్రామంలో వసతుల ఏర్పాటుకీ కృషిచేసింది. ఇప్పుడు ఆ ఊరివాళ్లు ‘మ్యాగీ రాకముందు, వచ్చిన తర్వాత...’ అని తమ ఊరి గురించి మాట్లాడుకుంటున్నారు.
ఉపకారవేతనాలతో ఉన్నత విద్యకు...
కీషా థోర్పె ఉద్యోగం పన్నెండో తరగతి పిల్లలకు ఇంగ్లిషు పాఠాలు చెప్పడం. అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో ఆమె పనిచేసేచోట ఉండేవారంతా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ తదితర ప్రాంతాల నుంచి వలసవచ్చిన వారు. మొదటిసారి ఇంగ్లిషు నేర్చుకుంటున్నవారు. పేదరికంతో చాలామంది అర్థాంతరంగా చదువు మానేసి పనుల్లో చేరిపోయేవారు. దాంతో ఎన్నేళ్లైనా వాళ్ల ఆర్థిక స్థితిగతులు మారకపోగా టీనేజ్లోనే పెళ్లిళ్లూ మద్యపానమూ మాదకద్రవ్యాలూ... ఇలా ఎన్నో సమస్యలు తలెత్తేవి. ఆ పరిస్థితిని మార్చేసింది కీషా. యూనివర్సిటీకి వెళ్లి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతూ ఫీజులు కట్టక్కరలేకుండా కాలేజీలో చేరేందుకు వీలుగా రకరకాల స్కాలర్షిప్పులకు పిల్లలచేత దరఖాస్తు చేయించేది. క్రమంగా పిల్లల్లో ఆసక్తి పెరిగింది. ఆమె ప్రోత్సాహంతో ఒక్క ఏడాదిలోనే ఏకంగా 55 కోట్ల విలువైన స్కాలర్షిప్పులు పొందారు పిల్లలు. వేర్వేరు కళాశాలల్లో నూరుశాతం ఉచితంగా సీట్లు సాధించారు. అలా కీషా చలవ వల్ల మొదటిసారిగా ఆ ప్రాంత విద్యార్థులు యూనివర్సిటీల్లో అడుగుపెట్టారు. పట్టభద్రులై మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అక్కడితో ఊరుకోలేదామె. తన సోదరితో కలిసి ఓ స్వచ్ఛంద సంస్థని ప్రారంభించింది. ఏ దేశాల పిల్లలైనా సరే అథ్లెటిక్స్లో నైపుణ్యం ఉండీ పేదరికం వల్ల అవకాశాలను అందిపుచ్చుకోలేక పోతున్నట్లయితే- ఈ సంస్థ వారికి అమెరికాలోని కాలేజీ, యూనివర్సిటీల్లో పూర్తిస్థాయి స్కాలర్షిప్తో ప్రవేశం కల్పిస్తుంది. అటు చదువూ ఇటు ఆటా కొనసాగించేలా చూస్తుంది. అలా ఇప్పటివరకూ 500 మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దింది.
అక్షరాస్యతా... ఆహారభద్రతా...
ఉపాధ్యాయుడైన తండ్రికి సమాజం ఇస్తున్న గౌరవాన్ని చూసిన పీటర్ తబీచి తానూ టీచరే అవ్వాలనుకున్నాడు. చదువైపోగానే ఓ ప్రైవేటు స్కూల్లో చేరాడు. సంపన్న కుటుంబాల పిల్లలు చదివే ఆ స్కూల్లో సకల సౌకర్యాలూ ఉండేవి. కానీ బయటి సమాజంలో అసలు స్కూలు మొహం చూడని ఎందరో చిన్నారులు కన్పించేవారు. వారికి కదా తన సేవలు అందాలీ అనుకున్న పీటర్ ప్రభుత్వ పాఠశాలలో సైన్సూ గణితమూ చెప్పే టీచరుగా చేరాడు. కెన్యాలో గిరిజన తెగల మధ్య అంతర్యుద్ధాలు జరిగిన కల్లోల ప్రాంతంలో ఉంది ఆ పాఠశాల. పిల్లల్లో నూటికి తొంభైమంది నిరుపేదలు కాగా అరవై మంది తల్లినో తండ్రినో కోల్పోయినవారు. వాళ్ల పేదరికాన్ని అర్థంచేసుకున్న పీటర్ తన జీతంలో 80శాతాన్ని బడికోసం ఖర్చుపెట్టాలనీ, పెళ్లి చేసుకోకుండా సేవకే అంకితమవాలనీ నిర్ణయించుకున్నాడు. పొద్దున్నే ఏడెనిమిది మైళ్లు నడిచి ఖాళీ కడుపుతో బడికి వచ్చే పిల్లలకు అల్పాహారం ఏర్పాటుచేశాడు. రకరకాల పోటీలు పెడుతూ పిల్లల్లో ఆసక్తిని రగిలించేవాడు. సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేవాడు. చదువులో వెనకబడిన పిల్లలకు ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పేవాడు. స్నేహితుల సాయంతో నిధులు సేకరించి కంప్యూటర్లు కొని పిల్లలకు నేర్పించాడు. ఊరికి ఇంటర్నెట్ సౌకర్యం లేదని తన ఫోనులో డేటాతో కంప్యూటర్లో వీడియోలు చూపించేవాడు. ముఖ్యంగా సైన్సు ప్రయోగాలు ఎంత బాగా నేర్పించేవాడంటే ఎక్కడ సైన్స్ ఫెయిర్ పెట్టినా ఈ స్కూలు పిల్లలకే ప్రైజులు వచ్చేవి. ‘నాకన్నా ముందే నా విద్యార్థిని విమానం ఎక్కింది, ఓ పోటీలో పాల్గొనడానికి అమెరికా వెళ్లింది’ అని గర్వంగా చెబుతాడు పీటర్. ఒకప్పుడు హైస్కూలు చదువు పూర్తిచేయడమే కలగా ఉన్నచోట ఇప్పుడు యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలున్నారు. సాయంత్రం వేళల్లోనూ వారాంతాల్లోనూ పిల్లల ఇళ్లకు వెళ్లి పెరట్లో కూరలు పండించుకోవడంలోనూ, కొద్ది స్థలంలో, తక్కువ ఖర్చుతో సాగు చేయడంలోనూ శిక్షణ ఇచ్చేవాడు. దాంతో పీటర్ ఆ గ్రామానికి వెళ్లిన నాలుగేళ్లలోనే అక్కడి సమాజంలో ఊహకందని మార్పులు చోటుచేసుకున్నాయి. పూటగడవని పరిస్థితి నుంచి కనీస ఆహారభద్రత సాధించుకునే స్థాయికి వచ్చారు అక్కడి ప్రజలు.
Thanks for reading The Global Teacher Prize is a US $1 million award presented annually to an exceptional teacher who has made an outstanding contribution to their profession.
No comments:
Post a Comment