Anantha Padmanabha swamy temple: పద్మనాభుడి ఆలయంలో... అంతుచిక్కని ఆరో గది!
ప్రపంచంలోకెల్లా సంపన్న దేవాలయం అనగానే మొన్న మొన్నటివరకూ ఎవరికైనా ఠక్కున స్ఫురించేది ఆ వడ్డీకాసులవాడు కొలువైన తిరుమల క్షేత్రమే. అయితే నేలమాళిగల్లో బయల్పడ్డ సుమారు లక్షన్నర కోట్లకు పైగా సంపదతో ఆ స్థానాన్ని కైవసం చేసుకుని భక్తులతోపాటు ప్రపంచవ్యాప్తంగా సందర్శకుల్నీ ఆకర్షిస్తోంది కేరళలోని పద్మనాభస్వామి ఆలయం.
అక్కడి స్వామివారికి అల్పాశీ ఉత్సవాలు(ఈ నెల 23 నుంచి నవంబరు 1వ తేదీ వరకూ) జరగనున్న సందర్భంగా... పద్మనాభుడి ఆలయ విశిష్టత...
తిరువనంతపురం... కేరళ రాజధాని అయిన ఈ నగరానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ కొలువైన అనంత పద్మనాభుడే. తిరు అనంతపురం- అంటే, అనంత పద్మనాభుడి పవిత్ర ఆలయం అని అర్థం. 108 దివ్యదేశాల్లో ఒకటైన ఈ ఆలయ గర్భగుడిలో శేషతల్పంమీద పవళించి ఉన్న ఆ శ్రీమహావిష్ణువును చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. భారీ విగ్రహ రూపంలో ఉన్న ఆ దివ్యమూర్తిని ఏక ద్వారం నుంచి కాకుండా శిరస్సునీ చేతినీ పాదాలనీ... వేర్వేరుగా మూడు ద్వారాల నుంచి చూడాల్సి రావడం, స్వామి కుడిచేయి శివలింగంమీద ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతలు. గర్భగుడిలో పద్మనాభుడి చెంతనే శ్రీదేవీ భూదేవీ కొలువుతీరగా, నాభినుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడూ దర్శనమిస్తాడు. ఏటా అక్టోబరు-నవంబరు మాసాల్లో పదిరోజులపాటు ఈ ఆలయంలో జరిగే అల్పాశీ ఉత్సవంలో- దేవతలకు పవిత్ర స్నానం చేయించే వేడుక భక్తులకు కన్నులపండుగే. ఇందుకోసం ఆలయం నుంచి సముద్రతీరం (సంగుముగం బీచ్) వరకూ భక్తులూ పోలీసులూ గజదళం వెంటరాగా స్వామివారిని వీధుల్లో ఊరేగిస్తూ తీసుకెళతారు. దీన్నే ఆరట్టు అనీ పిలుస్తారు. ఈ ఊరేగింపునకు తిరువాన్కూరు(ట్రావెంకోర్) రాజావారు కత్తి చేతపట్టుకుని ముందు నడుస్తూ సారథ్యం వహిస్తారు.
పురాతన ఆలయం!
కలియుగం ప్రారంభంలో ఈ ఆలయాన్ని నిర్మించారనీ అప్పటినుంచీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయనీ పేర్కొంటారు. చారిత్రకంగా చూస్తే- ఆరు లేదా ఎనిమిదో శతాబ్దంలో కట్టి ఉంటారనీ- ప్రస్తుత ఆలయాన్ని 16వ శతాబ్దంలో చేర, ద్రవిడ శైలుల్లో కట్టగా, గోపురాన్ని 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా మార్తాండవర్మ కట్టించి, ఆలయాన్ని పునరుద్ధరించాడనీ చెబుతారు. 12,008 సాలగ్రామాలతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లూ, ఈ సాలగ్రామాలను నేపాల్లోని గండకీ తీరం నుంచి తెచ్చినట్లూ, విగ్రహాన్ని రూపొందించేందుకు 4 వేలమంది శిల్పకారులూ 6 వేలమంది కార్మికులూ వంద ఏనుగులూ ఆరునెలలపాటు అహోరాత్రాలు శ్రమించినట్లూ, కటుసర్కర యోగం అనే ఆయుర్వేద పూతతో ఈ రాళ్లను అతికించినట్లూ తెలుస్తోంది. అప్పటికే అక్కడ గుట్టలుగా ఉన్న ఆలయ సంపదను డచ్ వర్తకుల బారి నుంచీ టిప్పుసుల్తాన్ దాడుల నుంచీ కాపాడేందుకు మార్తాండవర్మే విగ్రహం కింద రహస్యగదుల్ని నిర్మించి, నాటి సిద్ధుల్ని పిలిపించి ఓ గదికి నాగపాశం కూడా వేయించాడట. ఈయన తిరువాన్కూరు సంస్థానాన్ని పద్మనాభుడికి అంకితమిచ్చి, ఆయన తరపునే రాజకుటుంబం పాలిస్తుందనీ ప్రకటించాడు. దాంతో ఆయన వారసులూ పద్మనాభ దాసులుగానే రాజ్యానికి సేవ చేస్తూ వస్తున్నారు.
స్థల పురాణం!
పూర్వం దివాకర ముని అనే విష్ణుభక్తుడు స్వామి దర్శనంకోసం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయనకు ఆశ్రమం దగ్గర చిన్న బాలుడు కనిపిస్తాడు. ఆ పిల్లాడి తేజస్సుని చూసి ముచ్చటపడ్డ ముని తనతో ఉండమని కోరగా, బాలుడు ఒప్పుకుంటాడు. కానీ తనను ఏమీ అనకూడదనీ అలా అన్న వెంటనే వెళ్లిపోతాననీ షరతు పెడతాడు. సరేనన్న ఆ ముని, సహనంతో ఆ పిల్లాడు చేసే అల్లరిని భరిస్తాడు. అయితే ఓ రోజు ముని తపస్సు చేసుకుంటుండగా- ఆయన పూజించే సాలగ్రామాన్ని తీసి ఆడటంతో ఆగ్రహం పట్టలేక బాలుణ్ణి వెళ్లిపొమ్మంటాడు. అప్పుడా బాలుడు అదృశ్యమవుతూ ‘నన్ను చూడాలీ అనుకుంటే అనంత కాడుకు రమ్మ’ని చెబుతాడు. దాంతో ముని ఆ బాలుడు విష్ణువు అని గ్రహించుకుని ఆయన్ని చూసేందుకు అనంత కాడుకు వెళ్లగా- అక్కడున్న విప్ప చెట్టులో బాలుడు కనిపించడం, వెంటనే ఆ చెట్టు కిందపడి శ్రీమహావిష్ణువు రూపంగా మారడం జరిగిందట. తరవాత ఆ ప్రాంతాన్ని పాలించే రాజు అక్కడ గుడి కట్టించాడనేది పౌరాణిక కథనం.
ఎక్కడిదీ అనంత సంపద?
ఆలయంలోని నేలమాళిగలో దేవుడికి సంబంధించిన అపార సంపద ఉందనేది పూర్వం నుంచీ తెలిసినప్పటికీ దాని జోలికి ఎవరూ వెళ్లలేదు. స్వాతంత్య్రానంతరం- అక్కడి ఆలయాలన్నింటినీ తిరువాన్కూరు దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికీ పద్మనాభుడి ఆలయం మాత్రం రాజకుటుంబీకుల నిర్వహణలోనే ఉంది. కానీ అక్కడి సంపద గురించి సరైన వివరాలు ఉండేవి కావు. విదేశీ వర్తకం ద్వారా వచ్చిన బంగారాన్నీ, భక్తులు ఇచ్చిన కానుకల్నీ, రాజ్యాలను కొల్లగొట్టి తెచ్చిన సంపదనీ పద్మనాభుడి ఆలయంలోని రహస్య గదుల్లోనే దాచినట్లు కొన్ని పుస్తకాల్లోనూ ఉంది. వాటి ఆధారంగానే- అక్కడ వెలకట్టలేని సంపద ఉందనీ, కానీ ఆలయ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందనీ టి.పి. సుందరరాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా, కోర్టు ఓ కమిటీ వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. అందులో భాగంగా 2011లో ఆలయ పాలకమండలి గర్భగుడి లోపల ఇరవై అడుగుల లోతులో ఆరు రహస్య గదులను గుర్తించింది. వీటికి ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ అని పేర్లు పెట్టారు. అందులో ఐదు గదులను తెరిచారు. గదుల్లోపలకు దిగడానికి కొన్ని మెట్లు ఉండి, బంగారు పాత్రలూ దేవతా ప్రతిమలూ శంఖువులూ కొబ్బరికాయలూ కిరీటాలూ ఆభరణాలూ వజ్రాలూ... వంటివన్నీ రాశులకొద్దీ ఉన్నాయట. కృష్ణదేవరాయలు, ఈస్టిండియా, నెపోలియన్ కాలాల నాటి నాణేలు బస్తాలకొద్దీ లభించాయట. బంగారు కంకణాలూ, ఉంగరాల్లాంటివి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయనీ; మట్టి, రాగి పాత్రల్లో ఉన్న ఆ సంపదను పైకి తేవడానికి 12 రోజుల పైనే పట్టిందనీ చెబుతున్నారు.
నిజానికి ఈ ఆరు గదుల్లో నాలుగింటిని ఏటా వేడుకల సమయంలో తెరిచి, అందులోని వస్తువులను వాడి మళ్లీ అక్కడే పెడుతున్నారట. కానీ ‘ఎ, బి’ గదుల్ని గత 150 ఏళ్లుగా తెరవలేదట. అయితే, ‘ఎ’ గదిని మాత్రం చిట్టచివరగా 1930ల్లోనే తెరిచి, కొంత సంపదను నాటి రాజు బలరామవర్మ తరలించాడని కొందరు అంటున్నారు. అంటే- నాగపాశం వేశాక తెరవనిది ‘బి’ గది ఒక్కటే. అయితే సుందరరాజన్ పదే పదే అప్పీలు చేయడంతో సుప్రీంకోర్టు అన్ని గదుల్నీ తెరిచేందుకూ అనుమతి ఇచ్చింది.
ఆరో గది రహస్యం?
ఇప్పటివరకూ తెరవని ‘బి’ గదినే భరతక్కోన్ కల్లర లేదా ఆరో గది అనీ అంటున్నారు. దీనికే నాగబంధం వేసి ఉంది. అయితే ఇది పద్మనాభుడికి సంబంధించినదనీ సంపదలో భాగం కాదనీ ఇందులో శ్రీచక్రం ఉందనీ, జానపదాల్లోని కాంజిరోట్టు యక్షి అనే స్త్రీ అక్కడ స్వామిని కొలుస్తుందనే గాథలూ ఉన్నాయి. అయినప్పటికీ దీన్నీ తెరిచేందుకు ప్రయత్నించారట. పై భాగంలో ఉన్న లోహ ద్వారాన్నీ, దాని వెనకున్న చెక్క తలుపునీ కూడా తీయగా ఇనుముతో చేసిన మూడో తలుపు బయటపడింది. దానిమీద మహాసర్పాల బొమ్మలు తప్ప బోల్టులూ గడియల్లాంటివేమీ లేవు. దాంతో మలయాళీ తాంత్రికుల్ని రప్పించి, గరుడమంత్రాన్ని చదివిస్తే, అది తెరుచుకోలేదు సరికదా, కొందరు అధికారులకూ పూజారులకీ అనేక సమస్యలు వచ్చాయట. ఈలోగా రాజకుటుంబం దాన్ని తెరవకుండా ఇంజెంక్షన్ ఆర్డర్ తీసుకురావడంతో అప్పటికి ఆ ప్రయతాన్ని విరమించారు.
అలా ఆరోగది ఓ అంతుబట్టని రహస్యంగా ఉండిపోయింది. ఆ కాలానికి చెందిన సిద్ధులు మంత్రాలు వల్లె వేస్తూ వేసిన నాగబంధం- దాని గురించి పూర్తిగా తెలిసినవాళ్లు గరుడ మంత్రం చదివితే దానంతటదే తెరుచుకుంటుందనీ కొందరు పండితులు చెబుతుంటే, అది తెరిస్తే ప్రపంచానికే అరిష్టమని మరికొందరు జ్యోతిషులు అంటున్నారు. అయితే గరుడ మంత్రం చదివి ఆ పాశాన్ని విప్పగల సిద్ధ పురుషులెవరూ ప్రస్తుతం మనదగ్గర లేరట. 2018లో మరోసారి దాన్ని తెరవాలనుకోగా కేరళను వరదలు ముంచెత్తాయి. పైగా పిటిషన్ వేసిన సుందర రాజన్, గదుల్ని తెరిచిన కొన్నిరోజులకే మరణించడంతో ఈ నమ్మకం బలపడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించగా- అలల ఘోషతో అర్థంకాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయనీ, ఆ తరవాత 1930లలో ఓ దొంగల ముఠా దీన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా- పాములు చుట్టుముట్టాయనీ చెబుతుంటారు. ఆరో గదిని తెరిస్తే ఆలయం మునిగిపోతుందనీ, లోపల భారీ సర్పాలున్నాయనీ, వెలకట్టలేని సంపదతోపాటు ఎన్నో రహస్యాలూ ఉన్నాయనీ అవన్నీ మనుషుల కంటపడితే మానవజాతి వినాశనం జరుగుతుందనీ- ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. లోపల ఐదు లక్షల కోట్ల సంపద ఉండొచ్చనేది ఓ అంచనా. అందుకే దేశంలోనే మరెక్కడాలేని విధంగా ఈ గుడికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటుచేశారు. ఇవన్నీ ఎలాగున్నా 2004లో వచ్చిన సునామీలో పద్మనాభస్వామి ఆలయాన్ని ఒక్క అల కూడా తాకలేదు. దీన్నిబట్టి అక్కడేదో అంతుబట్టని రహస్యం ఉందన్నదే భక్తుల విశ్వాసం.
ఏదిఏమైనప్పటికీ అనంతమైన సంపదతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న ఆ దివ్యదేశంలోని ఆరోగదిలో సంపదే ఉందో లేక ఇంకేమైనా ఉందో ఆ పద్మనాభుడికే తెలియాలి.
Thanks for reading Anantha Padmanabha swamy temple
No comments:
Post a Comment