APY: పన్ను చెల్లింపుదారులు ఇకపై ఏపీవైలో చేరలేరు.. మరి మిగిలిన ఆప్షన్లేంటి?
అసంఘటిత రంగంలోని ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
భారత ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాల్లో అటల్ పెన్షన్ యోజన (APY) ఒకటి. అసంఘటిత రంగంలోని ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో పెట్టుబడులు పెట్టిన వారు 60 ఏళ్ల వయసు తర్వాత వారి వారి పెట్టుబడుల ఆధారంగా, నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెలా పెన్షన్ రూపంలో పొందుతారు. ప్రభుత్వం నియమాల ప్రకారం ఇంతకు ముందు వరకు ఈ పథకంలో 18 నుంచి 40 ఏళ్ల లోపు వారెవరైనా చేరవచ్చు. కానీ నేటి నుంచి (2022 అక్టోబరు 1) ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అనర్హులని ప్రభుత్వం ఆగస్టులో ప్రకటించింది. కాబట్టి ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ఇకపై ఈ పథకంలో చేరలేరు. అయితే ఇప్పటికే ఈ పథకానికి కాంట్రీబ్యూట్ చేస్తున్న వారు మాత్రం కొనసాగవచ్చు. ఒకవేళ ఆదాయపు చెల్లింపుదారులెవరైనా అక్టోబరు 1వ తేదీ తర్వాత ఏపీవైలో చేరినట్లు గుర్తిస్తే వెంటనే వారి ఖాతాలను మూసివేసి అప్పటి వరకు జమచేసిన మొత్తాన్ని తిరిగి చందాదారలకు చెల్లిస్తారు. ఆదాయపు పన్ను నియమాల ప్రకారం.. రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఆదాయపు పన్ను చెల్లింపుదారులు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పదవీ విరమణ తర్వాత ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF) వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాలతో పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. ఎన్పీఎస్లో సెక్షన్ 80సి కింద లభించే రూ.2.50 లక్షలకు అదనంగా రూ. 50 వేల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్పీఎస్ మార్కెట్లకు అనుసంధానమై ఉంటుంది. కాబట్టి రాబడి మారుతుంటుంది. 9 నుంచి 12 శాతం వరకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్పీఎస్తో పోలిస్తే పీపీఎఫ్లో రిస్క్ తక్కువగా ఉంటుంది. స్థిరమైన రాబడి ఉంటుంది. పీపీఎఫ్లో ప్రస్తుతం వార్షికంగా 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. సెక్షన్ 80సి కింద పెట్టుబడి పెట్టిన మొత్తంపై రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను వర్తించదు. ఈ రెండూ కాకుండా పన్ను చెల్లింపుదారులు యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్లనూ (ULIPs) ఎంచుకోవచ్చు.
అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలు..
అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల వయసు తర్వాత ప్రభుత్వం పెన్షన్ రూపంలో నిర్ణీత మొత్తాన్ని అందిస్తుంది. నెలవారీ కాంట్రీబ్యూషన్ ఆధారంగా రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000, గరిష్ఠగా రూ.5000 వరకు పెన్షన్ తీసుకొనే వీలుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ. 5000 పెన్షన్ పొందాలనుకుంటే.. మీ వయసు 18 ఏళ్లు అయితే 42 సంవత్సరాల పాటు నెలకు రూ. 210 చొప్పున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే మీ వయసు 40 అయితే.. 20 సంవత్సాల పాటు నెలకు రూ.1454 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. చిన్న వయసులోనే ఈ పథకంలో చేరడం ద్వారా చిన్న మొత్తాన్ని కాంట్రీబ్యూట్ చేస్తూ గరిష్ఠ పెన్షను పొందొచ్చు.
చివరిగా: వృద్ధాప్యంలో నెలవారీ ఆదాయానికి మూలం పెన్షన్. అందువల్ల జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వ్యక్తులు.. సంపాదిస్తున్న సమయంలోనే దీని గురించి నిర్ణయం తీసుకోవాలి.
Thanks for reading APY: Taxpayers can no longer join APY.. What are the other options?
No comments:
Post a Comment