ఏపీ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే..

మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం - మంత్రివర్గ సమావేశ కీలక నిర్ణయాలు ఇవే! -
Andhra Pradesh Cabinet Meeting: సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అంశాలపై నేటి నుంచి దశాలవారీగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు పెట్టిన తొలి ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలు నేటి నుంచి దశలవారీగా తీసుకోనున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నడిచిన ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున నెలకు రెండు పర్యాయాలు మంత్రివర్గ సమావేశం నిర్వహించే సాంప్రదాయాన్ని తిరిగి పునరిద్దరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సంతకం చేసిన 5 దస్త్రాలతో పాటు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు జరగాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశాలు, వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల వంటి కీలక అంశాలపై మంత్రివర్గంలో కీలకచర్చ జరుగుతున్నట్లు సమాచారం.
వీటికి ఆమోదం: ఇప్పటికే సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్ రూ.4 వేల పెంపు సహా పెండింగ్ బకాయిలు కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డీఎస్సీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలు ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్ ను అధికారులు క్యాబినెట్ ముందు ఉంచారు. జూలై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుంది.
పెన్షన్ల పెంపు అంశంపై మంత్రివర్గం చర్చించింది. వచ్చే జూలై 1 తేదీ నుంచి 3 వేల రూపాయల నుంచి 4 వేలకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు 3 వేలను ప్రభుత్వం చెల్లించనుంది. వచ్చే నెలలో 65 లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు ఒకేసారి 7 వేలు అందుకోనున్నారు. వీటితో పాటు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ - 6 పథకాల అమలు, అందుకు అణుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చిస్తున్నట్లు సమాచారం.
వీటితో పాటు సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అస్సైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపైనా వివరాలు క్యాబినేట్ ముందుకు రానున్నాయి. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు.
వివిధ కార్పొరేషన్ల పునరుద్దరణ వాటికి నిధుల సమీకరణ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్థి, ఎన్నికల్లో ప్రకటించిన బీసీలకు రక్షణ చట్టం హామీ అమలు, వివిధ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నూతన విద్యవిధానం, ఉచిత ఇసుక వంటి కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు మంత్రివర్గం తీసుకోనుంది.
Thanks for reading Highlights of the AP Cabinet meeting @ 24.06.24
No comments:
Post a Comment