MTS and Havaldar Posts : ఎంటీఎస్, హవాల్దార్ పోస్ట్లకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్.. 8,326 పోస్ట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ!
పదో తరగతి మొదలు ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకూ.. ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్కరి స్వప్నం! అందులోనూ కేంద్ర ప్రభుత్వ కొలువుల పట్ల క్రేజ్ మాటల్లో చెప్పలేనిది!!
పదో తరగతి అర్హతతోనే వివిధ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో.. మొత్తం 8,326 పోస్ట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో.. ఎస్ఎస్సీ–ఎంటీఎస్(మల్టీ టాస్కింగ్ స్టాఫ్), హవాల్దార్ నోటిఫికేషన్–2024
వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు..
భారీ సంఖ్యలో పోస్ట్లు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్–ఎంటీఎస్, హవాల్దార్–2024 నోటిఫికేషన్ ద్వారా.. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో భారీ సంఖ్యలో పోస్ట్ల భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తం 4,887 మల్టీ టాస్కింగ్ (నాన్–టెక్నికల్)పోస్ట్లను;సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ),సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) విభాగాల్లో 3,439 హవాల్దార్ పోస్ట్లకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
తెలుగు రాష్ట్రాల్లో 242 పోస్ట్లు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. ఎంటీఎస్, హవాల్దార్ నోటిఫికేషన్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 61 ఎంటీఎస్ పోస్ట్లు, విశాఖపట్నం సీజీఎస్టీలో 60 హవాల్దార్ పోస్ట్లు ఉన్నాయి. తెలంగాణలో 63 ఎంటీఎస్, హైదరాబాద్ సీజీఎస్టీ 58 హవాల్దార్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 242 పోస్ట్లను ఏపీ, తెలంగాణకు కేటాయించారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమకు ఆసక్తి ఉన్న రీజియన్, పోస్ట్లను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు తమ రీజియన్తో సంబంధం లేకుండా.. దేశంలో ఎక్కడైనా పని చేయాల్సిన విధంగా సర్వీస్ నిబంధనలు ఉంటాయి.
అర్హతలు
2024, ఆగస్ట్ 1 నాటికి పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: ఎంటీఎస్ పోస్ట్లకు 18–25 ఏళ్లు, హవాల్దార్ పోస్ట్లకు, అదే విధంగా పలు శాఖల్లోని ఎంటీఎస్ పోస్ట్లకు 18–27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
మూడు దశల ఎంపిక ప్రక్రియ
ఎస్ఎస్సీ ఎంటీఎస్, హవాల్దార్ పోస్ట్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా మూడు దశల్లో అభ్యర్థుల ప్రతిభను పరిశీలిస్తారు. అవి.. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఎంటీఎస్ పోస్ట్లకు కేవలం రాత పరీక్ష ఉంటుంది. హవాల్దార్ పోస్ట్లకు మాత్రం ఫిజికల్ టెస్ట్లు నిర్వహిస్తారు.
రెండు సెషన్లలో రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియ తొలిదశలో నిర్వహించే రాత పరీక్ష రెండు సెషన్లుగా 270మార్కులకు ఉంటుంది. సెషన్–1లో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 ప్రశ్నలు–60 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 ప్రశ్నలు–60 మార్కులకు; అదేవిధంగా సెషన్–2లో జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–75 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు–75 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగుతుంది. ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సెషన్కు కేటాయించిన సమయం 45 నిమిషాలు. రెండో సెషన్లో మాత్రం నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంటుంది.
పీఈటీ, పీఎస్టీ
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. హవాల్దార్ పోస్ట్ల అభ్యర్థులకు మలి దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లను నిర్వహిస్తారు.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా నడక పరీక్ష ఉంటుంది. ఇందులో పురుష అభ్యర్థులు 1,600 మీటర్లను 15 నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు ఒక కిలో మీటర్ దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుంది.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో.. హవాల్దార్ పోస్ట్ల అభ్యర్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి.
పురుష అభ్యర్థులు కనీసం 157.5 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 81 సెం.మీ ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు అయిదు సెంటీమీటర్లు విస్తరించాలి. n మహిళా అభ్యర్థులు కనీసం 152 సెం.మీ ఎత్తు ఉండాలి.
కనీస అర్హత మార్కులు
రాత పరీక్ష నుంచి అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేసే క్రమంలో కనీస అర్హత మార్కుల నిబంధన విధించారు. ప్రతి సెషన్లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 25 శాతం మార్కులు; ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 20 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. అదే విధంగా సెషన్–1లో కనీస అర్హత మార్కులు సాధిస్తేనే..సెషన్–2 పేపర్ల మూల్యాంకన చేస్తారు. సెషన్–2లో పొందిన ప్రతిభ ఆధారంగానే తుది జాబితా రూపొందిస్తారు.
ప్రారంభ వేతనం
ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలోనే పే లెవల్–1తో రూ.18,000–రూ.56,900 వేతన శ్రేణిలో నెల వేతనం అందుకోవచ్చు. బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. దీంతో పాటు అర్హతలు పెంచుకుంటూ సంబంధిత డిపార్ట్మెంట్లు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణతతో ఆయా శాఖల్లో సెక్షన్ ఆఫీసర్, సూపరింటెండెంట్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూలై 31
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: 01.08.2024
దరఖాస్తుల సవరణకు అవకాశం: ఆగస్టు 16, 17 తేదీల్లో
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీ: అక్టోబర్/నవంబర్లో నిర్వహించే అవకాశం.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ssc.gov.in
రాత పరీక్షలో రాణించేలా
న్యూమరికల్, మ్యాథమెటికల్ ఎబిలిటీ
ఇందులో రాణించడానికి అర్థమెటిక్తోపాటు ప్యూర్ మ్యాథ్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. నంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, రేషియోస్, అల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, లీనియర్ ఈక్వేషన్స్, టాంజెంట్స్ వంటి ప్యూర్ మ్యాథ్స్ అంశాలపై పట్టు సాధించాలి.
రీజనింగ్ ఎబిలిటీ
సింబల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిలేషన్ షిప్, క్లాసిఫికేషన్, నంబర్ సిరీస్, సిమాటిక్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వెన్ డయాగ్రమ్స్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
జనరల్ అవేర్నెస్
జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు మొదలు జనరల్ సైన్స్, ఎకానమిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ విభాగాలపై దృష్టి పెట్టాలి. హిస్టరీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలపై ప్రత్యేక దృష్టితో చదవాలి. జాగ్రఫీలో సహజ వనరులు, నదులు, పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఎకనామిక్స్కు సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక వాణిజ్య రంగాల్లో ఏర్పడిన కీలక పరిణామాలపై దృష్టి పెట్టాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పదజాలంపైనా పట్టు సాధించాలి. సీహెచ్ఎస్ఎల్ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ను కీలకంగా భావించాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్టాక్ జీకేలో.. చరిత్ర–ముఖ్యమైన వ్యక్తులు, తేదీలు, సదస్సులు, సమావేశాలు–వాటి తీర్మానాలు, అవార్డులు–విజేతలు వంటి సమాచారాన్ని ఔపోసన పట్టాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
అభ్యర్థులు గ్రామర్పై పట్టు సాధించాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొదలు ప్యాసేజ్ కాంప్రహెన్షన్ వరకూ.. అన్ని రకాల గ్రామర్ అంశాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ స్పీచ్, సినానిమ్స్, యాంటానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లపై పట్టు సాధించాలి.
రివిజన్, మాక్ టెస్ట్లు
అభ్యర్థులు నిరంతరం పునశ్చరణ కొనసాగించాలి. నమూనా పరీక్షలు, మాక్ టెస్ట్లకు హాజరవ్వాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో.. అర్థమెటిక్పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ఇందుకోసం పదో తరగతి స్థాయిలోని గణిత పుస్తకాలతో తమ ప్రిపరేషన్ ప్రారంభించాలి. వాటిద్వారా ముందుగా కాన్సెప్ట్లపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ దృక్పథంతో ప్రిపరేషన్, ప్రాక్టీస్ చేయాలి.
Thanks for reading MTS and Havaldar Posts : ఎంటీఎస్, హవాల్దార్ పోస్ట్లకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్.. 8,326 పోస్ట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ!
No comments:
Post a Comment