ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేం: మోదీ
వ్యాపారం సర్కారు పని కాదు
ప్రభుత్వంలో మిగిలేవి నాలుగు రంగాలే
100 పీఎస్యూల్లో ప్రైవేటు పెట్టుబడులు
రూ.2.50 లక్షల కోట్లు రాబడతాం
ప్రస్తుత కాలానికి తగ్గ సంస్కరణలు అనివార్యం
ప్రధాని మోదీ ఉద్ఘాటన
దిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను వారసత్వం పేరుతో నడపడం దేశ ఆర్థిక వ్యవస్థకు భారమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాటిని నడపలేమని, ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. 100 పీఎస్యూల్లో ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు రాబట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు తప్ప అన్ని పీఎస్యూలను ప్రైవేటీకరించేందుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రకటించిన కార్యక్రమాల అమలుపై బుధవారం వెబినార్లో ప్రధాని పాల్గొన్నారు. ప్రైవేటీకరణను గట్టిగా సమర్థించుకున్నారు. చమురు, సహజ వాయువు, విద్యుత్తు వంటి రంగాలను వాటి సామర్థ్యం మేరకు వాడుకోలేకపోతున్నామని చెప్పారు. పీఎస్యూలలో పెట్టుబడుల ద్వారా ప్రైవేటు రంగం అధునాతన సాంకేతికతను తీసుకువస్తుందని, యాజమాన్య ధోరణిలో మార్పులు కనిపిస్తాయని ఆయన చెప్పారు. అగ్రశ్రేణి మేనేజర్లతో ప్రపంచంలోని ఉత్తమ విధానాలను అనుసరించడానికి ఆస్కారం ఉంటుందని, మొత్తం వ్యవస్థ సమర్థతను ఇది పెంచుతుందని వివరించారు. ప్రైవేటీకరణ ద్వారా వచ్చే డబ్బును గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అనుసంధానత, సురక్షిత తాగునీటి సరఫరా, చౌకలో గృహ నిర్మాణం వంటివి పెంచడానికి ఉపయోగిస్తామని చెప్పారు.
ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
‘వ్యాపారాలను ప్రోత్సహించడం తప్ప, వ్యాపారం చేయడం ప్రభుత్వ విధి కాదు. యువ అధికారుల ప్రతిభను ప్రభుత్వ సంస్థల నిర్వహణ పేరిట వృథా చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ప్రజా సంక్షేమం చూడడమే సర్కారు ప్రథమ ప్రాధాన్యం. 50-60 ఏళ్ల క్రితం ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించిన నాటి పరిస్థితులు వేరు. కాలానికి అనుగుణంగా వీటిలో సంస్కరణలు తీసుకురావాలి. ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడమే మా లక్ష్యం. దేశాన్ని వృద్ధి ప్రస్థాన దిశగా తీసుకువెళ్లేందుకు స్పష్టమైన మార్గసూచీని బడ్జెట్ ఇచ్చింది’ అని ప్రధాని చెప్పారు.
పన్ను చెల్లింపుదారుల డబ్బు ఇది..
‘కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలను చవిచూస్తున్నాయి. వాటిలో కొన్నింటికి పన్ను చెల్లింపుదారుల డబ్బు ద్వారా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. పేదలు హక్కుదారులుగా ఉన్న డబ్బును పీఎస్యూల కోసం వెచ్చించాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థపై అధిక భారం పడుతుంది. చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నాయనో, కొందరి కలల ప్రాజెక్టులనో చెప్పి పీఎస్యూలను కొనసాగించరాదు. ప్రభుత్వం స్వయంగా సంస్థలను నడపడం, వాటికి యజమానిగా ఉండడం ప్రస్తుత కాలంలో అవసరం లేదు. అది సాధ్యం కూడా కాదు. ప్రభుత్వమే వ్యాపారం చేయడం ప్రారంభిస్తే కొన్నిసార్లు నష్టాలకూ దారితీస్తుంది. అందువల్ల ప్రభుత్వం వ్యాపారంలో ఉండరాదు’ అని మోదీ పేర్కొన్నారు. 1) అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ 2) రవాణా-టెలికమ్యూనికేషన్లు 3) విద్యుత్తు, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు 4) బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలు... ఈ నాలుగు రంగాల్లో మాత్రమే ప్రభుత్వ వాటా వీలైనంత కనిష్ఠ స్థాయిలో ఉంటుందని వివరించారు. ప్రజాధనం సద్వినియోగమే లక్ష్యంగా సంస్కరణలు చేపట్టడం అవసరమని.. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.
రూ.44,545 కోట్ల ప్రాజెక్టులపై సమీక్ష
పన్నెండు రాష్ట్రాల పరిధిలో కొనసాగుతున్న రూ.44,545 కోట్ల ప్రాజెక్టులను 36వ ‘ప్రగతి’ సమావేశంలో ప్రధాని సమీక్షించారు. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ను నిషేధించే కార్యక్రమ పురోగతినీ ఆయన అడిగి తెలుసుకున్నారు.
Thanks for reading Can't run public sector companies: Modi
No comments:
Post a Comment